ఇతర దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకుండా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన దేశంలో ఉన్న సమస్యలపై దృష్టి సారించాలని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖామెనెయి హితవు పలికారు. ఇరాన్లో కొనసాగుతున్న దేశవ్యాప్త నిరసనల నేపథ్యంలో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖామెనెయి ప్రసంగాన్ని శుక్రవారం ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ప్రసారం చేసింది.
దేశంలో జాతీయ ఐక్యతను కాపాడుకోవాలని ఖామెనెయి ఇరానీయులకు పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దేశంలోని సమస్యలపైనే దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. కొంతమంది “అల్లరిమూకలు” అమెరికా అధ్యక్షుడిని సంతృప్తిపరచాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఖామెనెయి ఆరోపించారు.
కొనసాగుతున్న నిరసనల మధ్య ఆయన వీటిని “ఉగ్ర చర్యలు”గా అభివర్ణిస్తూ ఇరాన్ స్టేట్ టీవీ లో ఆయన ప్రసంగించారు. తేహ్రాన్లోని గ్రాండ్ బజార్ వ్యాపారులు జాతీయ కరెన్సీ రియాల్ తీవ్రంగా పడిపోవడంపై ఆగ్రహంతో ప్రారంభించిన ఈ నిరసనలు, తర్వాత దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. 2022–23లో జరిగిన అశాంతి సమయంలో మహిళలు, బాలికలు కీలక పాత్ర పోషించగా, ఈసారి ప్రధానంగా యువకులే నిరసనల్లో పాల్గొంటున్నారు.
ఇంటర్నెట్ మానిటరింగ్ సంస్థ నెట్బ్లాక్స్ ప్రకారం, గురువారం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ బ్లాక్అవుట్ నమోదై, అది శుక్రవారం కూడా కొనసాగింది. 1979 ఇస్లామిక్ విప్లవంలో పదవి కోల్పోయిన ఇరాన్ చివరి షా కుమారుడు, ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న రేజా పహ్లవి మరిన్ని నిరసనలకు పిలుపునివ్వడంతో ఈ అంతరాయం సమకాలీనంగా చోటు చేసుకుంది.
అమెరికా కేంద్రంగా పనిచేసే హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం, ఈ అల్లర్లలో కనీసం 34 మంది నిరసనకారులు, నాలుగు మంది భద్రతా సిబ్బంది మరణించగా, సుమారు 2,200 మందిని అరెస్టు చేశారు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ నిరసనలు ఇరాన్లోని షియా నేతృత్వంలోని రాజకీయ వ్యవస్థపై పెరుగుతున్న అసంతృప్తిని ప్రతిబింబిస్తున్నాయి.
