లవ్ జిహాద్ తరహాలో లడ్డూ జిహాద్ జరుగుతోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి. వైసీపీ హయాంలో లడ్డూ క్వాలిటీ లేదని.. అనేక మంది భక్తులు ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ హయాంలోనే కల్తీ నెయ్యితో లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారని మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ అన్యమస్తుల కుట్ర అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో లడ్డూ తయారీకి వాడిన నెయ్యి కల్తీ గురించి కూటమి నాయకులు చెప్పినా పట్టించుకోలేదని.. సీబీఐ సిట్ కల్తీ నిజమే అని తేల్చడంతో భయాందోళనలు కలిగాయని చెప్పారు.
20 కోట్ల లడ్డూలు కల్తీ అయ్యాని సిట్ నివేదిక తేల్చింది. పవిత్రమైన లడ్డూని.. ఫుడ్ మాఫియా కంటే ఘోరంగా కల్తీ చేయడంతో.. రసాయనాలు కలిసిన లడ్డూ ప్రసాదం తిని కోట్లాది మంది హిందువుల ఆరోగ్యం చెడిపోయిందని ఆవేదన వ్యక్తి చేశారు. దేవుడి ప్రసాదాన్ని అపవిత్రం చేసి అంతకు మించిన మహాపాపాని ఒడిగట్టారని మండిపడ్డారు. కల్తీ నెయ్యి కేసులో సిబీఐ సిట్ నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. తప్పు చేసిన వాళ్లెవరూ వెంకటేశ్వర స్వామి శిక్ష నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. ఈ అంశం మీద వైసీపీ నేతలు రాజకీయాలు చేయడం మానుకొని.. జగన్ అండ్ కో వెంటనే శ్రీనివాసుడి భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అసలు కల్తీయే జరగలేదని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంత గట్టిగా వాదించినా.. అప్పట్లో తిరుపతి లడ్డూ ప్రసాదం నాణ్యత గురించి భక్తులు సోషల్ మీడియాలో చేసిన పాత పోస్టులు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ వారం పదిరోజుల వరకు సువాసనలు వెదజల్లే తిరుపతి లడ్డూ.. వైసీపీ హయాంలో రెండు మూడు రోజులకు పాడైపోయేదని చాలా మంది ఫిర్యాదు చేశారు. పోస్టులో పంపించిన లడ్డూలు.. భక్తుల ఇంటికి చేరే సమయానికి పాడైపోయేవని వివరించారు. సామాన్య భక్తులతో పాటు సాధువుల, స్వామీజీలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
