హైదరాబాద్ నగరంలో వరుసగా తీవ్రమైన నేరాలకు పాల్పడుతూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఇద్దరు మోస్ట్ వాంటెడ్ రౌడీషీటర్లపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ఆదేశాల మేరకు ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ కింద నిరోధక నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసి జైలుకు తరలించారు. ఈ మేరకు కేసు వివరాలను రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్.హెచ్.ఓ) చౌదరి నేతాజీ ఒక ప్రకటనలో మీడియాకు వెల్లడించారు.
పోలీసుల కథనం ప్రకారం రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓమర్ బిన్ హంజా అల్ జాబ్రి అలీ బిన్ హంజా అల్ జాబ్రి అనే ఇద్దరు రౌడీషీటర్లు గత కొంతకాలంగా నగరంలో హత్యలు, హత్యాయత్నాలు, బలవంతపు వసూళ్లు, ప్రజలను ప్రాణాలతో తీస్తామని బెదిరించడం వంటి పలు తీవ్రమైన చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. వీరిలో ఓమర్ బిన్ హంజా అల్ జాబ్రిపై ఇప్పటివరకు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 8 గంభీరమైన కేసులు నమోదు కాగా, అలీ బిన్ హంజా అల్ జాబ్రిపై 7 నేరపూరిత కేసులు నమోదై ఉన్నాయి.
వీరు నిరంతరం స్థానిక వ్యాపారులను, అమాయక ప్రజలను ఆయుధాలతో బెదిరిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడటమే కాకుండా, సమాజంలో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీస్తూ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు సృష్టిస్తున్నారు.
పీడీ యాక్ట్ అమలు
వీరి నేర ప్రవృత్తి రోజురోజుకూ శ్రుతిమించుతుండటం, సాధారణ బెయిల్పై బయటకు వచ్చి తిరిగి అవే నేరాలకు పాల్పడుతుండటంతో… నగర ప్రజల భద్రతను, ప్రజా శాంతిని కాపాడటం కోసం వీరిపై పీడీ యాక్ట్ అస్త్రం ప్రయోగించాలని రెయిన్ బజార్ పోలీసులు ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు. ఈ నివేదికలను మరియు వారు చేసిన నేరాల తీవ్రతను క్షుణ్ణంగా పరిశీలించిన గౌరవ నగర పోలీస్ కమిషనర్ గారు, సదరు రౌడీషీటర్లపై పీడీ యాక్ట్ కింద నిర్బంధ ఉత్తర్వులను జారీ చేస్తూ ఆమోదం తెలిపారు.
ఈ సందర్భంగా రెయిన్ బజార్ ఎస్.హెచ్.ఓ చౌదరి నేతాజీ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అలవాటుగా నేరాలకు పాల్పడేవారు, రౌడీషీటర్లు, సమాజ వ్యతిరేక శక్తులపై భవిష్యత్తులోనూ ఇటువంటి కఠినమైన చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని ఆయన హెచ్చరించారు. ప్రజల భద్రతకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని, నేర రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
