ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2026-27పై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు, మీడియా ప్యానెలిస్టులతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆదివారం ఆడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణపై ఆయన పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అత్యంత ప్రగతిశీలకమని, రాష్ట్ర అభివృద్ధికి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను సిద్ధం చేసిందని మాధవ్ కొనియాడారు. ప్రధానంగా సంపద సృష్టి, అభివృద్ధి, సంక్షేమం అనే మూడు కీలక సూత్రాల ఆధారంగా ఈ బడ్జెట్ రూపొందించబడిందని ఆయన విశ్లేషించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 3,32,000 కోట్ల భారీ వ్యయంతో, 11.25% వృద్ధి రేటు లక్ష్యంగా ఈ బడ్జెట్ను ప్రతిపాదించడం ప్రభుత్వ సాహసోపేతమైన చర్య అని ఆయన పేర్కొన్నారు.
అదేవిధంగా, రెవెన్యూ లోటును 1.86 శాతానికి పరిమితం చేయడం ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనమని పీవీఎన్ మాధవ్ అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ తోడవ్వడం వల్ల రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని ఆయన వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంపూర్ణ సహకారంతో ‘వికసిత ఆంధ్రప్రదేశ్’ ద్వారా ‘వికసిత భారత్’ నిర్మాణానికి ఈ బడ్జెట్ బలమైన పునాది వేస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ల వల్ల కలిగే ప్రయోజనాలను సమ్మిళితం చేస్తూ ప్రజలకు వివరించాలని పార్టీ అధికార ప్రతినిధులకు ఈ సందర్భంగా ఆయన సూచించారు.
