ప్రముఖ సినీ నటుడు రజినీకాంత్ సతీమణి లత ఇప్పుడు తమిళ రాజకీయాల్లో సంచలనం గా మారారు. ‘మక్కల్ మేడై’ పేరుతో ఆమె ఓ కొత్త ఉద్యమాన్ని ప్రారంభించారు. లతా రజనీకాంత్ ఓ కొత్త వీడియో విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. రజనీకాంత్ భార్య లతా రజినీకాంత్ ఇప్పటికే పలు సంస్థల ద్వారా సామాజిక సేవ చేస్తున్నారు.
ఇప్పుడు ఆమె ‘మక్కల్ మేడై’ (పీపుల్ స్టేజ్) అనే కొత్త ఉద్యమాన్ని ప్రారంభించారు. మార్పు కోరుకునే ప్రజలందరూ మాతో చేతులు కలపాలని ఆమె పిలుపునిచ్చారు. మనమందరం కలిసి ప్రజాశక్తిగా మారి మంచి పనులు చేద్దామని ఆమె అన్నారు. ఈ ఉద్యమంలో చేరడానికి మొబైల్ నంబర్, ఈమెయిల్ కూడా ప్రకటించారు.
ఈ విషయంపై ఆమె విడుదల చేసిన వీడియోలో ఆమె మాట్లాడుతూ, , ‘సిటిజెన్ ప్లాట్ఫామ్’ అయిన తమ ఉద్యమంలో చేరి ప్రజాసేవ చేయాలని యువతకు పిలుపునిచ్చారు. ‘ప్రజాశక్తిగా మారి సమాజానికి సేవ చేసేందుకు ముందుకు రండి. మనమందరం కలిసి నిర్మాణాత్మక పనులు చేద్దాం’ అని ఆమె అన్నారు. సీనియర్ సిటిజన్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఉపాధ్యాయులు ఎవరైనా తమ అనుభవాన్ని పంచుకోవచ్చని తెలిపారు.
స్థానిక నాయకులను తయారు చేయడమే తమ లక్ష్యమని ఆమె ప్రకటించారు. ఇది కేవలం ఒక సంస్థ కాదని, సమాజంలో మార్పు కోరుకునే ప్రతి పౌరుడికి ఒక మంచి వేది క అని ఆమె తెలిపారు. విద్య, ఆరోగ్యం, జీవనోపాధి వంటి అన్ని రంగాల్లో తమిళనాడు సాధిస్తున్న అభివృద్ధిని మరో స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమన్నారు. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడం, అట్టడుగు వర్గాల సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారాలు కనుగొనడం ఈ ఉద్యమ ముఖ్య ఉద్దేశమని ఆమె వివరించారు.
లతా రజనీకాంత్కు పిల్లల సంక్షేమం, విద్యా రంగాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. ఆమె ఆశ్రమ్ పాఠశాల ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. దయా ఫౌండేషన్, పీస్ ఫర్ చిల్డ్రన్ వంటి సంస్థల ద్వారా పేద పిల్లల హక్కుల కోసం పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆమె ప్రకటించిన ‘మక్కల్ మేడై’ ఉద్యమం ఆమె సామాజిక సేవలో మరో ముందడుగుగా భావిస్తున్నారు. ఈ ఉద్యమంలో చేరాలనుకునే వారు 7550080515 నంబర్కు లేదా makkalmedaitn12@gmail.com ఈమెయిల్కు సంప్రదించవచ్చు.
