కార్పొరేట్ ఉద్యోగులకే కాదు.. రైతులకూ క్రెడిట్ కార్డులు అందజేస్తోంది మోడీ సర్కారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా అన్నదాతకు అవసరంలో రుణ సదుపాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఈ స్కీమ్ని మరింత ముందుకు తీసుకెళ్లి.. పాడి రైతులకూ క్రెడిట్ కార్డులు అందజేయాలని నిర్ణయించింది.
ఇప్పటికే రైతు భరోసా, ఉచిత విద్యుత్ వంటి పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర సర్కారు.. రైతుల సంక్షేమం కోసం.. సెంట్రల్ స్కీమ్స్ని క్షేత్ర స్థాయిలో అందరికీ అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే ఒరవడిలో వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన పాడి రైతుల కోసం పశు కిసాన్ క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నారు.
ఈ కార్డు ద్వారా రైతులు 3 లక్షల రూపాయల వరకు రుణం తీసుకొనే అవకాశం ఉంటుంది. ఎటువంటి హామీలు, గ్యారెంటీలు లేకుండానే లక్షా అరవై వేల వరకు రుణం పొందే సదుపాయాన్ని కల్పిస్తున్నారు.
40 రోజుల్లోగా రుణం తిరిగి చెల్లిస్తే.. వడ్డీ ఉండదు. 40 రోజులు దాటితే 7 శాతం వార్షిక వడ్డీతో చెల్లించాల్సి ఉంటుంది. సంవత్సరానికి ఏడు శాతం అంటే.. నెలకు అర్ధ రూపాయి వడ్డీ పడుతుంది. ఏడాది లోపల లోన్ తిరిగి కట్టేస్తే.. నాబార్డు నుంచి 3 శాతం వడ్డీ మినహాయింపు లభిస్తుంది.
అంటే నికరంగా 35 పైసల వడ్డీకే పాడి రైతులకు రుణం అందుబాటులోకి వస్తుంది. పశు కిసాన్ క్రెడిట్ ద్వారా తీసుకున్న రుణాలు.. ఆన్లైన్లో తిరిగి చెల్లించవచ్చు.
అర్హత కలిగిన రైతులకు పశు కిసాన్ క్రెడిట్ కార్డుతో పాటు బ్యాంకు పాసు పుస్తకం కూడా ఇస్తారు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, భూమి పత్రాలు, పశువుల ఆరోగ్య రికార్డులు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేసి క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి.
ఇప్పటికే కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న వాళ్లు ఈ కేవైసీ పూర్తి చేయడం ద్వారా వడ్డీ రాయితీ బెనిఫిట్ పొందవచ్చు. ఈ పథకం కోసం సమపంలోని పశు సంవర్ధక శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.
