నందమూరి బాలకృష్ణ..సిల్వర్ స్క్రీన్ మీద గర్జించే సింహం మాత్రమే కాదు…నియోజకవర్గ ప్రజల కష్టాల్లో తోడుండే అసలైన ప్రజా నాయకుడు. హిందూపురం నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ..సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా నియోజకవర్గ అభివృద్ధి విషయంలో మాత్రం ఎప్పుడూ కాంప్రమైజ్ కాలేదు. ప్రస్తుతం దాదాపు రూ. 92.5 కోట్ల భారీ వ్యయంతో రోడ్ల వెడల్పు, సుందరీకరణ పనులు చేయిస్తూ హిందూపురం రూపురేఖలను మారుస్తున్నారు.
ఇక,ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో బాలయ్య మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. గత 12 ఏళ్లుగా అద్దె ఇళ్లు, గెస్ట్ హౌస్లో ఉంటూ వస్తున్న ఆయన, ఇప్పుడు హిందూపురంలోనే సొంతంగా ఇల్లు నిర్మించుకుంటున్నారు. ఫిబ్రవరి 19న తన సతీమణితో కలిసి ఈ కొత్త ఇంటికి భూమి పూజ కూడా చేశారు. ఇకపై బాలకృష్ణ ప్రజలకు మరింత చేరువకానున్నారు. దీంతో నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రైతు సంక్షేమం, మౌలిక వసతుల కల్పనలో బాలయ్య స్పీడ్ మామూలుగా లేదు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న హంద్రీనీవా జలాలను చెరువులకు మళ్లించి, స్వయంగా జలహారతి పట్టి హిందూపురం రైతుల కళ్లల్లో ఆనందం నింపారు. లేపాక్షి మండలంలో కోట్లాది రూపాయలతో BT రోడ్లు వేయించడమే కాకుండా, పట్టుగూళ్ల మార్కెట్ను ఏర్పాటు చేసి స్థానిక ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ ఇచ్చారు. తాను షూటింగ్స్ లో ఉన్నా సరే, తన ప్రతినిధుల ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు.
రాజకీయాలతో పాటు మానవత్వంలోనూ బాలయ్యది తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్గా ఎంతోమంది పేదలకు ఉచిత వైద్యం అందేలా చూస్తున్నారు. ఇటీవల మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాలను ప్రారంభించి వైద్య సేవలను ప్రజల ఇంటి వద్దకే తీసుకెళ్తున్నారు. అటు మాస్ హీరోగా వెండితెరను ఏలుతూనే, ఇటు బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా హిందూపురంను అభివృద్ధి పథంలో నడిపిస్తూ అందరి మనసు గెలుచుకుంటున్నారు.
