ఎర్రగుంట్ల పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా భారీ ఎత్తున నగదు దొరికింది. ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అక్రమంగా డబ్బు తరలిస్తూ దొరికిపోయారు. ముద్దనూరు నుంచి ఎర్రగుంట్ల వైపు వస్తున్న కారును వాహనాల తనిఖీలో భాగంగా పోలీసులు ఆపి చెక్ చేశారు. కారులో చెక్ చేయగా 500 రూపాయల నోట్లు మొత్తం రూ. 2.52 కోట్ల నగదు దొరికింది.
ప్రొద్దుటూరు కు చెందిన బంగారు వ్యాపారి మీరావలి గుమాస్తాలు గా వారిని పోలీసులు గుర్తించారు. గుంతకల్లులో శంకర్ నారాయణ అనే వ్యక్తికి బంగారు నగలు ఇచ్చి డబ్బు తీసుకొస్తున్నామని వారు పోలీసులకు వెల్లడించారు. ఐతే ఈ డబ్బుకు సంబంధించి ఎలాంటి బిల్లులు చూపలేదు. దీంతో డబ్బును సీజ్ చేసినట్లు ఎర్రగుంట్ల పోలీసులు ప్రకటించారు. డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాన్ని విచారిస్తామని ఎర్రగుంట్ల సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు.
