ప్రముఖ పుణ్యక్షేత్రమైన అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయ సముదాయాల్లో ఆగమ శాస్త్ర సంప్రదాయాలను కచ్చితంగా అమలు చేయాలని, భక్తులకు మెరుగైన దర్శన సౌకర్యాలు కల్పించాలని జోగుళాంబ గద్వాల జిల్లా బ్రాహ్మణ పరిషత్ డిమాండ్ చేసింది.
ఈ మేరకు పరిషత్ జిల్లా అధ్యక్షులు కె. మోహన్ రావు హైదరాబాద్లో దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావును కలసి వినతిపత్రం సమర్పించారు. ఆగమ సంప్రదాయాల అమలు అవసరం క్షేత్రంలోని వైష్ణవ ఆలయాలైన శ్రీ యోగనారసింహ స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి, సూర్యనారాయణ స్వామి ఆలయాల్లో ఆయా ఆగమ సంప్రదాయాల ప్రకారం (వైఖానస లేదా పాంచరాత్ర) అర్చకులను నియమించాలని కోరారు.
ప్రస్తుతం కేవలం వైదిక స్మార్త సంప్రదాయం ఉన్నవారికే, అది కూడా ఒకే కుటుంబానికి చెందిన వారికి మాత్రమే అవకాశం కల్పించడం వల్ల ఆలయ విధులు సమర్థవంతంగా సాగడం లేదని తెలిపారు. దీనివల్ల ధనుర్మాస ఉత్సవాలు, తిరుప్పావై పఠనం వంటి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించబడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అసౌకర్యంగా మారిన దర్శన వేళలు
ప్రస్తుతం అమలులో ఉన్న దర్శన సమయాలు భక్తులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయని మోహన్ రావు పేర్కొన్నారు.
శ్రీ యోగనారసింహ స్వామి ఆలయం: ఉదయం 6 నుండి 7 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుండి 12:30 వరకు, సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు మాత్రమే దర్శనం కల్పిస్తున్నారు.
సూర్యనారాయణ స్వామి ఆలయం: ఉదయం 7 నుండి 8 గంటల వరకు, మధ్యాహ్నం 12:30 నుండి 1 గంట వరకు, సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు మాత్రమే ఆలయాన్ని తెరిచి ఉంచుతున్నారు.
ఇలాంటి పరిమిత దర్శన వేళలు రాష్ట్రంలో మరెక్కడా లేవని, దీని వల్ల భక్తులు ఆలయాలకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.
ప్రచారం లోపం – నిరాదరణకు గురవుతున్న ఆలయాలు
అలంపూర్ క్షేత్రంలో శక్తిపీఠంతో పాటు అనేక ప్రాచీన ఆలయాలు ఉన్నప్పటికీ, సరైన ప్రచారం లేకపోవడం వల్ల అవి నిరాదరణకు గురవుతున్నాయని తెలిపారు. సామాన్య భక్తులు నిర్వహించుకునే రూ.50 కుంకుమార్చన సేవలను పునరుద్ధరించాలని కూడా కోరారు. ఇన్చార్జిగా వచ్చిన అధికారులు ఆలయంలో 888 జి ఓ కి ఒక విరుద్ధంగా ఇష్టారీతినా నియామకాలు చేయడం పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు
అదేవిధంగా అలంపూర్లోని ప్రసాద్ (PRASAD) స్కీమ్ భవనంలో భక్తులకు పూర్తిస్థాయిలో వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే అలంపూర్ ఆలయాలకు యునెస్కో గుర్తింపు పొందేందుకు దేవాదాయ శాఖ తనవంతు కృషి చేయాలని కోరారు.
ఆలయ అధికారులు వెంటనే స్పందించి పీఠాధిపతులు, ఆగమ పండితుల సలహాతో దర్శన వేళలను సవరించి క్షేత్ర పవిత్రతను పరిరక్షించాలని బ్రాహ్మణ పరిషత్ విజ్ఞప్తి చేసింది. ఈ వినతిపత్రం ప్రతులను సంబంధిత దేవాదాయ శాఖ అధికారులకు కూడా పంపినట్లు తెలిపారు.
