మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని పారుపెళ్లి గ్రామం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. గ్రామంలో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా భైరవ నామ స్మరణతో మారుమోగింది.
ఈ సందర్భంగా స్వామివారికి భక్తులు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన భజన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తులంతా భజన కీర్తనలతో పునీతులయ్యారు.
అనంతరం వెంకటాపూర్ గ్రామానికి చెందిన కలికోట రమాదేవి-సంతోష్ దంపతుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీగా తరలివచ్చిన భక్తులతో పారుపెళ్లి కాలభైరవ ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి.
