అతి కీలకమైన హోర్మోజ్ జలసంధిపై ఇరాన్ తన పట్టును వీడటం లేదు. అంతే కాకుండా అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిపై తన నియంత్రణను ఇరాన్ అధికారికంగా బలపరుస్తోంది. ఇండస్ట్రీ నిపుణుల ప్రకారం, ఇరాన్ ప్రస్తుతం హోర్మోజ్ జలసంధి వద్ద “టోల్ బూత్ విధానం”ను అమలు చేస్తోంది. కొన్ని నౌకలు ఈ మార్గం ద్వారా వెళ్లేందుకు చైనా యువాన్ కరెన్సీలో చెల్లింపులు చేస్తున్నట్లు సమాచారం.
మరోవైపు అమెరికా ఈ ప్రాంతంలో సైనిక బలగాలను సమీకరిస్తోంది. USS ట్రిపోలీ యుద్ధ నౌక ఆధ్వర్యంలోని స్ట్రైక్ గ్రూప్ మధ్యప్రాచ్యానికి చేరువవుతోంది. దాదాపు 2,500 మెరైన్స్తో పాటు 82వ ఎయిర్బోర్న్ విభాగానికి చెందిన సుమారు 1,000 మంది పారా ట్రూపర్లను కూడా అక్కడికి తరలిస్తున్నారు. ఈ సైనిక కదలికలు అమెరికా నేరుగా ఇరాన్పై భూభాగ దాడి చేస్తుందనే హామీ ఇవ్వకపోయినా, అవసరమైతే చర్యలు తీసుకునేందుకని భావిస్తున్నారు.
ముఖ్యంగా హోర్ముజ్ సమీపంలోని ఇరాన్ చమురు కేంద్రాలు, ఖార్గ్ ఐలాండ్ వంటి వ్యూహాత్మక ప్రాంతాలను స్వాధీనం చేసుకునే అవకాశాన్ని అమెరికా పరిశీలిస్తోంది. అమెరికా నేవీ అధికారి అడ్మిరల్ బ్రాడ్ కూపర్ ప్రకారం, ఫిబ్రవరి 28 నుంచి ఇజ్రాయెల్తో కలిసి ప్రారంభించిన యుద్ధంలో ఇప్పటివరకు 10,000కు పైగా లక్ష్యాలపై దాడులు జరిపారు.
ఇరాన్కు చెందిన పెద్ద నౌకలలో 92 శాతం వరకు నాశనం చేశామని, అలాగే మిసైల్, డ్రోన్, నౌకాదళ ఉత్పత్తి కేంద్రాలలో రెండొంతులు ధ్వంసమయ్యాయని తెలిపారు. “ఇంకా మా చర్యలు కొనసాగుతాయి, ఇరాన్ సైనిక వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా ముందుకెళ్తున్నాం” అని ఆయన స్పష్టం చేశారు.
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల్లో ఇరాన్, అమెరికా తమ తమ వైఖరిని మరింత కఠినతరం చేసుకున్నాయి. యుద్ధ విరమణకు సంబంధించిన దౌత్య ప్రయత్నాలు విఫలమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలో సుమారు 20 శాతం చమురు మరియు సహజ వాయువు రవాణా జరిగే ఈ మార్గంపై ఇరాన్ ఆధిపత్యం పెరగడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.
