విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలోని 35వ వార్డులో ఉన్న పూర్ణ మార్కెట్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 16 దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనపై వార్డు నాయకులు విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇన్చార్జ్ సీతంరాజు సుధాకర్ కి సమాచారం అందించగానే, ఆయన వెంటనే ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.
సీతంరాజు సుధాకర్ చొరవతో తమ జీవనోపాధిని కోల్పోయిన బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. కూటమి ప్రభుత్వం బాధితుల కోసం ధ్వంసం అయిన దుకాణాలను కొత్తగా నిర్మించడంతో పాటు, ప్రతి లబ్ధిదారునికి ఆర్థిక సహాయంగా రూ.10,000 చెక్కులను మంజూరు చేసింది.
ఈ చెక్కులను తెలుగు దేశం పార్టీ విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇన్చార్జ్ సీతంరాజు సుధాకర్, జనసేన పార్టీ ఎమ్మెల్యే వంశీ కృష్ణ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి, కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
