యుద్ధం ముగిసినా కూడా అతి కీలకమైన హోర్మోజ్ జలసంధిని తెరవడం ఇప్పటిలో సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ఎక్కడెక్కడ మందుపాతరలు పెట్టారో ఇరాన్ మరచిపోయింది. గత నెలలో జరిగిన ఘర్షణ సమయంలో ఇరాన్ సముద్ర మార్గంలో మందుపాతరలను అమర్చింది.
ప్రస్తుతం వాటి ఖచ్చితమైన స్థానం గుర్తించడం, తొలగించడం పెద్ద సమస్యగా మారిందని అమెరికా అధికారుల సమాచారాన్ని ఆధారంగా తీసుకుని ది న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. మార్చి ప్రారంభంలో అమెరికా, ఇజ్రాయెల్ సైనిక చర్యలతో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఇరాన్ ఈ కీలక సముద్ర మార్గంలో చిన్న పడవల ద్వారా పేలుడు గుంతలను అమర్చడం ప్రారంభించింది.
అయితే ఆ ప్రక్రియ అప్పటినుంచే సరిగా నిర్వహించలేదని, వేగంగా కూడా సాగలేదని అమెరికా అధికారులు అభిప్రాయపడ్డారు. దీనితో ఆ చర్యల అమలు విధానం, పర్యవేక్షణపై అప్పుడే సందేహాలు వ్యక్తమయ్యాయి.
కుదేలైన నౌకాయాన రంగం
మందుపాతరలు అమర్చకముందే హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మార్చి రెండో తేదీన ఇరాన్ విప్లవ గార్డుల ఉన్నతాధికారి ఈ మార్గాన్ని మూసివేసినట్లు ప్రకటిస్తూ, ప్రవేశించే నౌకలను కాల్చివేస్తామని హెచ్చరించారు. ఈ ప్రకటన ఒక్కటే ప్రపంచ నౌకాయాన రంగాన్ని కుదిపేసి, చమురు ధరలను ఒక్కసారిగా పెంచింది.
తర్వాత పేలుడు గుంతలు అమర్చిన అనంతరం పరిస్థితి మరింత దిగజారింది. ట్యాంకర్ నౌకల రాకపోకలు గణనీయంగా తగ్గిపోయాయి. నౌకాదారులు పేలుడు గుంతల ముప్పుతో పాటు డ్రోన్, క్షిపణి దాడుల భయంతో వెనుకంజ వేశారు. ఈ పరిణామాలు యుద్ధ సమయంలో ఇరాన్కు ఒక స్థాయిలో వ్యూహాత్మక ఆధిక్యాన్ని కల్పించాయి.
అయితే ఇప్పుడు అదే వ్యూహం ఇరాన్కు సమస్యగా మారింది. పేలుడు గుంతలను ఎక్కడ అమర్చారన్న దానిపై సరైన రికార్డులు లేవని అమెరికా అధికారులు పేర్కొంటున్నారు. సముద్ర ప్రవాహాల వల్ల కొన్ని గుంతలు తమ స్థానాల నుంచి తరలిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. అవి సక్రమంగా కాకుండా చెల్లాచెదురుగా అమర్చబడటం వల్ల వాటిని గుర్తించి తొలగించడం మరింత క్లిష్టమైంది.
సాధారణ పరిస్థితి ఎప్పటికి వస్తుందో
ప్రస్తుతం పరిస్థితిని కొంతమేర నియంత్రించేందుకు ఇరాన్ పరిమిత మార్గాన్ని నౌకాయానానికి అనుమతిస్తోంది. ప్రమాదాన్ని అంగీకరించే నౌకలకు కొన్ని మార్గాల ద్వారా ప్రయాణం చేసే అవకాశం ఇస్తోంది. విప్లవ గార్డులు ప్రమాద ప్రాంతాలపై హెచ్చరికలు జారీ చేయగా, అధికారిక మీడియా కొంత భద్రమైన మార్గాలను సూచించే పటాలను విడుదల చేసింది. అయినప్పటికీ సాధారణ స్థితికి ఇంకా చాలా దూరంగా ఉంది.
ఈ పరిస్థితి దౌత్య పరంగా కూడా ప్రభావం చూపుతోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాత్కాలిక కాల్పుల విరమణకు హోర్ముజ్ జలసంధిని పూర్తిగా, సురక్షితంగా తిరిగి ప్రారంభించడం కీలక షరతుగా పేర్కొన్నారు. దీంతో ఇరాన్పై మరింత ఒత్తిడి పెరిగింది.
సముద్రంలో అమర్చిన మందుపాతరలను తొలగించడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. అధునాతన సాంకేతికత, ప్రత్యేక నౌకలు అవసరం అవుతాయి. అత్యాధునిక సామర్థ్యాలు ఉన్న అమెరికా సైన్యానికే ఈ ప్రక్రియ సవాలుగా ఉండగా, పరిమిత వనరులు ఉన్న ఇరాన్కు ఇది మరింత కష్టంగా మారింది.
ఇక ఇటీవల జరిగిన అమెరికా దాడుల్లో ఇరాన్ నౌకాదళానికి చెందిన కొన్ని మౌలిక సదుపాయాలు, నౌకలు దెబ్బతిన్నాయి. అయినప్పటికీ ఇరాన్ వద్ద ఇంకా వందల సంఖ్యలో చిన్న పడవలు ఉన్నాయి. ఇవి మళ్లీ పేలుడు గుంతలను అమర్చడం లేదా నౌకలను వేధించడం వంటి చర్యలకు ఉపయోగపడే అవకాశం ఉంది.
ఈ పరిస్థితుల్లో హోర్ముజ్ జలసంధిలో ఇంకా ఎన్ని పేలుడు గుంతలు ఉన్నాయో, అవి ఎక్కడ ఉన్నాయో స్పష్టత లేకపోవడం ప్రపంచ నౌకాయాన రంగానికి పెద్ద ముప్పుగా మారింది. దీనివల్ల ప్రపంచ ఇంధన సరఫరాలు, వాణిజ్య వ్యవస్థలు తీవ్ర అనిశ్చితిలో కొనసాగుతున్నాయి.
