ఉత్తరాఖండ్లో హిందువుల అత్యంత పవిత్రమైన చార్ధామ్ యాత్ర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని గంగోత్రి, యమునోత్రి ఆలయాల తలుపులు తెరుచుకోవడంతో ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైంది. వేద మంత్రోచ్ఛారణలు, భక్తుల జయజయధ్వానాల మధ్య ఆలయ కమిటీలు అర్చకులు సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
యాత్రలో భాగంగా ఇతర ప్రధాన ఆలయాలైన కేదార్నాథ్ ఈ నెల 22న తెరుచుకోనుండగా, బద్రీనాథ్ ఆలయాన్ని 23న ఉదయం 6:15 గంటలకు తెరవడానికి ముహూర్తం ఖరారు చేశారు. యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉత్తరాఖండ్ ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. కేవలం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులకు మాత్రమే ఆలయ దర్శనానికి అనుమతి ఇస్తున్నారు.
భక్తుల సౌకర్యార్థం ఈ నెల 22వ తేదీ నుంచే హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ చార్ధామ్ యాత్ర నవంబర్ నెల వరకు నిరంతరాయంగా కొనసాగనుంది. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం పటిష్టమైన భద్రత, వైద్యం మరియు రవాణా ఏర్పాట్లు చేసింది. హిమాలయాలలోని ఈ పుణ్యక్షేత్రాల దర్శనం కోసం ఇప్పటికే లక్షలాది మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
