ఏఐఏడిఎంకే నిట్టనిలువుగా చీలిపోయింది. ఏఐఏడిఎంకే పార్టీకి చెందిన సీనియర్ నేత సి షణ్ముగం నేతృత్వంలో 30 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగరేసి అధికార TVK ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు.
తమదే అసలైన AIADMK అని ప్రకటించిన రెబల్ వర్గం, పార్టీ ప్రస్తుత నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యంగా పార్టీ ప్రధాన నేత ఎడప్పాడి కె పళనిస్వామి డిఎంకేతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా చర్చలు జరుపుతున్నారని ఆరోపిస్తూ, ఆ నిర్ణయం తమకు ఆమోదయోగ్యం కాదని షణ్ముగం వర్గం వెల్లడించింది.
ఈ నేపథ్యంలోనే పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రత్యేక శాసన వర్గంగా కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు రెబల్ ఎమ్మెల్యేలు ప్రకటించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం AIADMK నుంచి మొత్తం 47 మంది ఎమ్మెల్యేలు ఎన్నికైన నేపథ్యంలో, అందులో 30 మంది తిరుగుబాటు చేయడం తమిళనాడు రాజకీయాల్లో భారీ సంచలనంగా మారింది.
అధికార TVK ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడం ద్వారా రాష్ట్ర రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రెబల్ వర్గం మద్దతుతో ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి అసెంబ్లీలో మరింత బలం చేకూరే అవకాశం కనిపిస్తోంది.
ఇక ఈ పరిణామాలపై AIADMK ప్రధాన నాయకత్వం అత్యవసర సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత చర్యలు తీసుకునే అవకాశాన్ని కూడా పార్టీ పరిశీలిస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
