అమెరికా ఇరాన్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ ఆడిన మరొక దొంగ నాటకం బయటపడింది. అమెరికా ఇజ్రాయిల్ దాడుల నుంచి తమ యుద్ధ విమానాలను కాపాడుకోవడానికి ఇరాన్ కోరగానే పాకిస్తాన్ తమ భూ భాగంలో వాటిని నిలిపేందుకు అంగీకరించిందట. అమెరికా వైమానిక దాడుల నుంచి రక్షించేందుకు ఇరాన్ తన సైనిక విమానాలను పాకిస్తాన్లోని నూర్ ఖాన్ ఎయిర్బేస్కు తరలించింది. అలాగే కొన్ని పౌర విమానాలను పొరుగు దేశమైన ఆఫ్ఘనిస్థాన్ లో కూడా నిలిపినట్లు CBS News పేర్కొంది.
ఈ వార్తలపై స్పందించిన అమెరికా రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం, “ఈ సమాచారం నిజమైతే అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిగా పాకిస్తాన్ పాత్రను పూర్తిగా పునఃసమీక్షించాల్సి ఉంటుంది” అని ఎక్స్లో పేర్కొన్నారు. గతంలో ఇజ్రాయెల్పై పాకిస్తాన్ రక్షణ అధికారుల వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఈ ఆరోపణలు నిజమై ఉండొచ్చని ఆయన వ్యాఖ్యానించారు.
ఫిబ్రవరి 28న ప్రారంభమైన అమెరికా-ఇరాన్ యుద్ధం ఏప్రిల్ 8 నుంచి తాత్కాలిక విరమణలో ఉంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించిన వెంటనే ఇరాన్ “బహుళ విమానాలను”, అందులో ఒక నిఘా, గూఢచారి విమానాన్ని కూడా పాకిస్తాన్కు పంపిందని సీబీఎస్ రిపోర్ట్ తెలిపింది.
అయితే ఈ ఆరోపణలను పాకిస్తాన్ సీనియర్ అధికారి ఖండించారు. “నూర్ ఖాన్ ఎయిర్బేస్ నగర మధ్యలో ఉంది. అక్కడ పెద్ద ఎత్తున విమానాలు ఉంటే ప్రజలకు కనిపించకుండా దాచడం అసాధ్యం” అని ఆయన పేర్కొన్నారు.
ఇక మహాన్ ఎయిర్ కు చెందిన ఒక ఇరానియన్ పౌర విమానం యుద్ధం ప్రారంభానికి ముందు కాబూల్లో దిగిందని, అనంతరం ఇరాన్ గగనతలం మూసివేసిన తర్వాత కూడా అక్కడే నిలిచిందని అఫ్గాన్ సివిల్ ఏవియేషన్ అధికారి తెలిపారు. తర్వాత పాకిస్తాన్ అఫ్గానిస్తాన్పై దాడులు ప్రారంభించడంతో ఆ విమానాన్ని హెరాత్ విమానాశ్రయానికి తరలించినట్లు సమాచారం.
ఇక గత దశాబ్దంలో పాకిస్తాన్కు చైనా నుంచి సైనిక సహాయం గణనీయంగా పెరిగిందని నివేదిక పేర్కొంది. Stockholm International Peace Research Institute అధ్యయనం ప్రకారం, 2020-2024 మధ్య పాకిస్తాన్కు వచ్చిన ప్రధాన ఆయుధాల్లో సుమారు 80 శాతం చైనా నుంచే వచ్చాయి.
అమెరికాతో సంబంధాలను కొనసాగిస్తూ, మరోవైపు ఇరాన్ మరియు చైనాతో విభేదాలు రాకుండా జాగ్రత్తపడుతూ పాకిస్తాన్ “సమతౌల్య రాజకీయాలు” కొనసాగిస్తోందని సీబీఎస్ విశ్లేషించింది.
