AP రాజకీయాల్లో Y.S. జగన్ మోహన్ రెడ్డి వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. జగన్ స్వతహాగా క్రైస్తవ సామాజిక వర్గానికి చెందినవారు. ఆయన తల్లి విజయమ్మ నిత్యం చేతిలో బైబిల్ పట్టుకుని కనిపిస్తుంటారు. అయితే, ఎన్నికల సమయంలో మతం పేరుతో ఓట్లు దండుకోవడం తప్ప, అధికారంలోకి వచ్చాక ఆ వర్గానికి జగన్ చేసిన మేలు శూన్యం. క్రైస్తవ మైనార్టీల ఓట్లతో గద్దెనెక్కిన జగన్..ఆ తర్వాత వారి సంక్షేమాన్ని గాలికొదిలేశారనేది నగ్న సత్యం. 2024 ఎన్నికల్లో జగన్ దుర్మార్గపు పాలన అంతం కావాలని ఆ వర్గం ప్రత్యేక ప్రార్థనలు చేసిందంటే..వైసీపీపై వారిలో ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఒక చేత్తో బైబిల్ చూపిస్తూ క్రైస్తవుల ఓట్లు కొల్లగొట్టిన జగన్..రాజకీయ లబ్ధి కోసం మరో చేత్తో పూజారులు, స్వామీజీలను వెంటబెట్టుకుని ప్రదక్షిణలు చేయడం ఆయన ద్వంద్వ వైఖరికి, మోసకారి తనానికి నిదర్శనం. గత వైసీపీ ఐదేళ్ల దుర్మార్గపు పాలనలో ఏకంగా 188 మంది దళిత క్రైస్తవులు దారుణ హత్యలకు,దాడులకు గురయ్యారంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో ఊహించుకోవచ్చు. ఎన్నికల సమయంలో పాస్టర్లకు గౌరవ వేతనం ఇస్తానని నమ్మబలికిన జగన్..తీరా కుర్చీ ఎక్కాక వారిని నిలువునా దగా చేశారు.
చంద్రబాబు హయాంలో క్రైస్తవ సామాజిక వర్గం కోసం సుమారు 20కి పైగా సంక్షేమ పథకాలను అమలు చేస్తే.. జగన్ అధికారంలోకి రాగానే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వాటన్నింటినీ రద్దు చేశారు. ముఖ్యంగా పేద క్రైస్తవ విద్యార్థుల ఉన్నత చదువులకు ఆసరాగా ఉన్న విదేశీ విద్యా పథకానికి పాతరేశారు. గత TDP ప్రభుత్వం ఏకంగా 937 చర్చిల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తే, సొంత వర్గంపై ప్రేమ ఒలకబోసే జగన్ కేవలం 10 చర్చిలకు మాత్రమే నిధులు విదిలించారు. అంతెందుకు, గుంటూరులో క్రైస్తవుల శ్మశాన వాటిక కోసం 17 ఎకరాలు కేటాయిస్తే, ఆ పుణ్యభూమిలో ఏకంగా మట్టిని సైతం తవ్వుకుని అమ్ముకున్న ఘనత వైసీపీ నాయకులకే దక్కుతుంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రైస్తవులకు రక్షణ, గౌరవం, సంక్షేమం దక్కాలంటే అది కేవలం చంద్రబాబుతోనే సాధ్యమని ఆ వర్గం బలంగా విశ్వసిస్తోంది. అందుకే 2024 ఎన్నికల్లో కూటమి విజయదుందుభి మోగించడంలో క్రైస్తవులు కీలక పాత్ర పోషించారు. కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే, ఇచ్చిన మాట ప్రకారం 8,428 మంది పాస్టర్లకు రూ.81 కోట్లు అందించి చంద్రబాబు తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు.
