భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు ఓటరు జాబితాల సమగ్ర పరిశీలన (SIR) అత్యంత కీలకమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ రాజ్యాంగబద్ధమేనని బుధవారం అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ జోయ్మాల్య బాగ్చి సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును ప్రకటించింది. స్వేచ్ఛాయుత ఎన్నికలు కేవలం ఓటింగ్ ప్రక్రియకే పరిమితం కావని, ఖచ్చితమైన, విశ్వసనీయమైన ఓటరు జాబితాలపై ప్రజాస్వామ్య వ్యవస్థ ఆధారపడి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది.
రాజ్యాంగంలోని 324వ అధికరణంతో పాటు ప్రజాప్రతినిధుల చట్టం–1950 మరియు సంబంధిత నిబంధనల ప్రకారం ఎన్నికల సంఘానికి ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టే పూర్తి అధికారాలు ఉన్నాయని న్యాయస్థానం తెలిపింది. సాధారణ సవరణ విధానాలకు పూర్తిగా అనుగుణంగా లేకపోయినా, చట్టం ఇచ్చిన అధికార పరిధిలోనే ఈ ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం చేసింది.
ఓటరు జాబితా నుంచి పేరు తొలగించినంత మాత్రాన సంబంధిత వ్యక్తి పౌరసత్వం రద్దు అయినట్టుకాదని ధర్మాసనం స్పష్టంచేసింది. పౌరసత్వంపై అనుమానం ఉన్న వారి వివరాలను కేంద్ర ప్రభుత్వానికి పంపించి, పౌరసత్వ చట్టం ప్రకారం తుది నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘానికి సూచించింది.
ఓటరు జాబితాలో చేర్చుకునే అర్హతపై మాత్రమే ఎన్నికల సంఘం నిర్ణయం వర్తిస్తుందని, పౌరసత్వంపై తుది అధికారం కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంబంధిత సంస్థలదేనని న్యాయస్థానం పేర్కొంది. బిహార్తో పాటు ఇతర రాష్ట్రాల్లో చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణను వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంఘం, తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా, రాజద్ నేత మనోజ్ ఝా, కాంగ్రెస్ నేత కే.సి. వేణుగోపాల్, ఎన్సీపీ నాయకురాలు సుప్రియా సూలే, సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై ఈ తీర్పు వెలువడింది.
సవరణ ప్రక్రియలో చట్టబద్ధ ఓటర్ల పేర్లు తొలగిస్తున్నారని పిటిషనర్లు ఆరోపించగా, మరణాలు, వలసలు వంటి కారణాలతోనే తొలగింపులు జరిగాయని ఎన్నికల సంఘం వాదించింది. ఇప్పటికే బిహార్, పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో ఈ ప్రక్రియ అనంతరం ఎన్నికలు పూర్తయ్యాయి. మరికొన్ని రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది.
