గుడివాడలో రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నిర్వహించిన ప్రెస్మీట్లో మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిపై తీవ్ర విమర్శలు చేశారు. గుడివాడ టిడిపి కార్యాలయంలో అంగన్వాడీ సమస్యలపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “గుడివాడ వైసీపీ ఇంచార్జ్ పదవి నుంచి తొలగిస్తారనే భయంతోనే కొడాలి నాని బిక్కుబిక్కుమంటూ సొల్లు మాటలు మాట్లాడుతున్నాడు” అని వ్యాఖ్యానించారు.
“పాపాలు, తప్పులు చేసిన వారు ఎవరైనా జైలుకే వెళతారు. కానీ అన్యాయంగా ఎవరినీ అరెస్ట్ చేసే ఉద్దేశం మా ప్రభుత్వానికి లేదు. చట్టం ముందు అందరూ సమానమే.. టిడిపి కార్యకర్త అయినా, వైసీపీ నాయకుడైనా ఒకటే” అని రాము స్పష్టం చేశారు. ఇటీవల అంబటిని కలిసిన కొడాలి నాని విషయంపై స్పందిస్తూ, “జైల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకే కలిశారు.
అక్కడ గుట్కాలు ఉంటాయా, సౌకర్యాలు ఎలా ఉన్నాయా అన్నదే తెలుసుకోవాలని వెళ్లారు” అని రాము వ్యంగంగా అన్నారు. గుడివాడలో జరుగుతున్న అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించిన ఆయన, “వరదలు వచ్చినప్పుడు వైసీపీ నాయకులు ఎక్కడికి పోయారు? ఒక్కరికైనా సహాయం అందించారా?” అని ప్రశ్నించారు. “సప్త సముద్రాలు దాటి మా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. గుడివాడ ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబితే చాలు” అని అన్నారు.
“బాలయ్య బాబు డైలాగులు చెప్పడం వల్ల ఉపయోగం లేదు. నిజం ఏమిటో ప్రజలకు తెలుసు. సొల్లు మాటలు చెబితే ఈ సారి డిపాజిట్లు కూడా రావు. ప్రజలు పూర్తిగా మర్చిపోయిన వ్యక్తి గురించి మాట్లాడటం వ్యర్థం” అని రాము వ్యాఖ్యానించారు. “ప్రతి పక్ష హోదా గురించి మాట్లాడటమే తప్ప ప్రజల సమస్యలపై వైసీపీకి పట్టడం లేదు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల తరఫున పోరాటం చేసేది టిడిపి మాత్రమే.
ఎన్ని అవమానాలు ఎదురైనా ఒక్క టీడీపీ కార్యకర్త కూడా వెనక్కి తగ్గలేదు. 2019 మాదిరిగా ప్రజలు ఇక మోసపోరు” అని అన్నారు. వైసీపీ పాలనలో జరిగిన వినాశనాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని పేర్కొన్న రాము, “మేము అధికారంలో ఉన్నామని నోటికి వచ్చినట్లు మాట్లాడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలను ప్రోత్సహించరు.
రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతోంది. ఇప్పటికైనా పిచ్చి మాటలు మానుకోవాలి” అని సూచించారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు కంచర్ల సుధాకర్, మజ్జాడ నాగరాజు, గోకవరపు సునీల్, పొట్లూరి కృష్ణారావు, రామిదేని వేణుబాబు, వంగపండు ఆదినారాయణ, రెడ్డి షణ్ముఖ్, వేశపోగు ఇమ్మానుయేలు, రెడ్డి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
