బెంగళూరులోని తిగలరపల్య, తులసినగర్లో జరిగిన ఒక ఘటన అందరినీ కలచివేసింది. 22 ఏళ్ల భవానీ, చందన్ అలియాస్ చంద్రశేఖర్తో ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వ్యతిరేకించి భవానీకి మరో పెళ్లి చేయాలని ప్రయత్నించారు.
నిన్న ఉదయం భవానీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో చందన్తో ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. ఆ ఫోటో కుటుంబ సభ్యుల దృష్టికి వెళ్లడంతో ఇంట్లో ఉద్రిక్తత నెలకొంది. కొంతసేపటి తర్వాత భవానీ ఫోన్కు స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానపడి ఇంటి యజమానికి సమాచారం ఇచ్చారు.
గదిలోకి వెళ్లి చూడగా భవానీ మృతదేహం కనిపించగా, చందన్ విషం తాగిన స్థితిలో కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తులో చందన్ భవానీ గొంతు నులిమి హత్య చేసినట్లు తేలిందని సమాచారం. అనంతరం విషం తాగి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడా? లేదా దొరికిపోతాననే భయంతో విషం తాగాడా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు, భవానీ-చందన్ ఏడాది క్రితమే రహస్యంగా వివాహం చేసుకున్నారని కూడా సమాచారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న చందన్ ప్రమాదం నుంచి బయటపడగా, అతనిపై హత్య కేసు నమోదు చేసి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
