రాయలసీమ డెవలప్మెంట్ పేరుతో దశాబ్ధాల క్రితం జరిగిన భారీ భూ దోపిడికి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ముగింపు పలికింది. YSR హయాంలో జరిగిన అతిపెద్ద ల్యాండ్ స్కామ్పై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని బ్రాహ్మణి స్టీల్స్ ఆధీనంలో ఉన్న ఏకంగా 10,700 ఎకరాల విలువైన భూములను ప్రభుత్వం అధికారికంగా స్వాధీనం చేసుకుంది. జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే, ఆయన తండ్రి హయాంలో జరిగిన క్విడ్ ప్రో కో కేటాయింపులను రద్దు చేయడం ద్వారా వైఎస్ కుటుంబ మార్క్ క్రోనీ క్యాపిటలిజంపై కూటమి ప్రభుత్వం చావుదెబ్బ కొట్టింది.
రాజశేఖర రెడ్డి హయాంలో గాలి జనార్ధన్ రెడ్డి నేతృత్వంలోని బ్రాహ్మణి స్టీల్స్ పరిశ్రమ కోసం, విమానాశ్రయం నిర్మాణం పేరిట జమ్మలమడుగు ప్రాంతంలో దాదాపు 10,700 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములను కారుచౌకగా కట్టబెట్టారు. స్టీల్ ప్లాంట్ నిర్మించి లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తామని నాడు నమ్మబలికారు.
కానీ, ఆచరణలో అక్కడ ఒక్క ఇటుక కూడా పడలేదు. పరిశ్రమల పేరుతో వేల ఎకరాల ప్రజల భూములను చేజిక్కించుకుని, వాటిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయల లోన్లు పొందేందుకే ఈ భూ-దందా సాగింది. గాలి జనార్ధన్ రెడ్డి జైలుకు వెళ్లడం, ఆ తర్వాత ఐదేళ్ల జగన్ రెడ్డి హయాంలోనూ ఈ భూములపై ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఇదొక పొలిటికల్ స్కామ్గా మిగిలిపోయింది.
పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన భూములను నిర్ణీత కాలంలో ఉపయోగించకపోతే వెనక్కి తీసుకునే నిబంధనల ప్రకారం రెవెన్యూ యంత్రాంగం రంగంలోకి దిగింది. దీనిపై గతంలో ఉన్న కోర్టు స్టేలను, చట్టపరమైన చిక్కులను పక్కాగా వ్యూహంతో అధిగమిస్తూ కూటమి ప్రభుత్వం ఈ భూములను ప్రభుత్వం పరం చేసింది.
జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తన తండ్రి చేసిన భూ కేటాయింపులను కాపాడుకుంటూ కాలయాపన చేయగా, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం మాత్రం క్షణాల మీద నిర్ణయం తీసుకుని జగన్ అనుచర గ్యాంగ్కు కోలుకోలేని షాక్ ఇచ్చింది.
ఈ భూములు కొత్త ప్రాజెక్టులకు కీలకం
స్వాధీనం చేసుకున్న ఈ 10 వేల ఎకరాలకు పైగా భూములను ఇప్పుడు క్లియర్ టైటిల్తో APIIC ల్యాండ్ బ్యాంక్లోకి చేర్చనున్నారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించే పనిలో ఉండటంతో ఈ భూములు కీలకం కానున్నాయి.
ఉమ్మడి కడప జిల్లాలో ఇప్పటికే JSW స్టీల్స్ వంటి సంస్థలు అడుగుపెడుతున్న తరుణంలో, ఇంత భారీ ఎత్తున వివాద రహిత భూమి అందుబాటులోకి రావడం అంతర్జాతీయ పెట్టుబడిదారులకు పెద్ద పిలుపు కానుంది. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, భారీ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు లేదా డేటా సెంటర్ల ఏర్పాటుకు ఈ భూములను కేటాయించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
పాతికేళ్ల క్రితం రాయలసీమ యువతకు ఉపాధి చూపిస్తామంటూ ఆశపెట్టి, కేవలం కాగితాలకే పరిమితమైన బ్రాహ్మణి స్టీల్స్ భూముల కథ సుఖాంతమైంది. ఒకప్పుడు ఫ్యాక్షన్, మైనింగ్ మాఫియా చేతుల్లో చిక్కుకున్న ఈ భూములు ఇప్పుడు అధికారికంగా ప్రభుత్వ చేతుల్లోకి రావడంతో కడప జిల్లా ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. రాజకీయ నాయకుల సొంత లాభాల కోసం వాడేసుకుని వదిలేసిన ఈ వేల ఎకరాల సామ్రాజ్యాన్ని.. చంద్రబాబు ప్రభుత్వం ఎంత వేగంగా నిజమైన పరిశ్రమలుగా మార్చి రాయలసీమ ముఖచిత్రాన్ని మారుస్తుందో చూడాలి.
