సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసి, స్వయం సమృద్ధి దిశగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖా మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
రుణభారం తగ్గించి, తక్కువ వడ్డీతో దీర్ఘకాలిక రుణాలు సమీకరించేలా 10 రోజుల్లో సమగ్ర ఆర్థిక ప్రణాళిక (Funding Roadmap) సిద్ధం చేయాలని ఆయన సూచించారు. ఆదివారం రోజున కుందన్ బాగ్ లోని ఆయన క్యాంపు కార్యాలయంలో సాగునీటి సంస్థల ఆర్థిక పరిస్థితి, నిధుల సమీకరణ, రుణాల పునర్వ్యవస్థీకరణపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షా సమావేశంలో నీటిపారుదల శాఖ కార్యదర్శి ఈ. శ్రీధర్, ఇంజనీర్-ఇన్-చీఫ్ (జనరల్) రమేష్ బాబు, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బడ్జెట్పై ఆధారపడకుండా సాగునీటి సంస్థలకు స్థిరమైన ఆదాయ వనరులు కల్పించేందుకు కొత్త ఆర్థిక నమూనాలను రూపొందించాలని ఆయన స్పష్టం చేశారు.
ఇందులో భాగంగా సాగునీటి సంస్థల ఖాళీ భూముల్లో సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం లేదా లీజుకు ఇచ్చి ఆదాయం పొందే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. నిజాంసాగర్తో పాటు ఇతర జలాశయాల పరిసరాల్లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల సాధ్యతను అధ్యయనం చేయాలని సూచించారు.
అయితే కొత్త ఆదాయ మార్గాల వల్ల రైతులపై ఎలాంటి అదనపు భారం పడకూడదని మంత్రి స్పష్టం చేశారు. అన్ని ప్రతిపాదనలను చట్టపరంగా పరిశీలించిన తర్వాతే అమలు చేయాలని చెప్పారు. 2022-23తో పాటు పెండింగ్లో ఉన్న అన్ని ఆర్థిక సంవత్సరాల చట్టబద్ధ ఆడిట్లను వెంటనే పూర్తి చేయాలని, ఆడిటర్ల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
గతంలో అధిక వడ్డీతో తీసుకున్న రుణాలను తక్కువ వడ్డీకి పునర్వ్యవస్థీకరిస్తే ప్రభుత్వంపై పడుతున్న ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం సుమారు 11 శాతం వడ్డీతో ఉన్న రుణాలను తక్కువ వడ్డీకి మార్చితే ఏటా సుమారు రూ.250 కోట్ల వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని అధికారులు వివరించారు.
ప్రతి సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించిన రుణ వివరాలు, వడ్డీ, చెల్లింపులు, పనుల పురోగతి, పూర్తి చేయడానికి అవసరమైన నిధులు తదితర అంశాలతో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. తక్కువ పెట్టుబడితో త్వరగా పూర్తయ్యే ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గత రుణభారం లేని ఒక సాగునీటి సంస్థ ద్వారా కొత్త నిధులను సమీకరించే అవకాశాన్ని కూడా సమావేశంలో పరిశీలించారు.
అలాగే శాఖకు చెందిన భూములు, ఇతర ఆస్తుల పూర్తి వివరాలను 15 రోజుల్లో సిద్ధం చేసి వనరుల సమీకరణకు ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూసేకరణ పరిహారానికి ఇప్పటికే విడుదల చేసిన నిధులు రైతులకు ఆలస్యం లేకుండా చేరేలా చూడాలని కూడా మంత్రి అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
