కడప జిల్లాలోని ఒంటిమిట్ట పుణ్యక్షేత్రాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గురువారం ఒంటిమిట్ట స్టేట్ గెస్ట్ హౌస్లో జరిగిన సమీక్ష సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జ్, జిల్లా కలెక్టర్, తిరుమల తిరుపతి దేవస్థానాల జేఈవో తదితర అధికారులతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించారు.
ఒంటిమిట్టను తిరుమల తరహాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అదే సమయంలో, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి, ఆర్థికంగా అభివృద్ధి చెందే కేంద్రంగా మార్చాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రాజంపేట నియోజకవర్గ అభివృద్ధిపై కూడా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజుతో చర్చించి, ప్రాంతీయ అభివృద్ధి కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా జాంబవంతుని విగ్రహంతో ప్రత్యేక ఐలాండ్ ఏర్పాటు, ప్రధాన ప్రాంతాలకు రహదారి కనెక్టివిటీ, వేద పండితుల సూచనల మేరకు ఆధ్యాత్మిక అభివృద్ధి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఒంటిమిట్ట గ్రామ అభివృద్ధికి ప్రత్యేక అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి సూచించారు.
