స్వేచ్చ, స్వాతంత్య్రం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణ, అంతిమంగా మనిషి మనిషిగా గుర్తించబడే సమాజం కోసం జీవితాంతం పోరాడిన నర్రా బాలసిద్ధారెడ్డి (బా.సి.రెడ్డి) జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయాకమని పలువురు వక్తలు వెల్లడించారు. చిరుప్రాయంలోనే తల్లి దండ్రులను కోల్పోయి అనాధ జీవితాన్ని గడుపుతునే, కమ్యూనిజం వైపు ఆకర్షితులై, నిరుపేదల పక్షపాతిగా నిలబడి ఆయన చేసిన పోరాటాలు చిరస్మరనీయమని వారు కొనియాడారు.
కమ్యూనిస్టు పార్టీ పోరాట యోధుడు, తన తండ్రి బా.సి.రెడ్డి పోరాట జీవితంపై సుప్రసిద్ధ కవి, రచయిత డాక్టర్ నందిని సిధారెడ్డి రచించిన “నాగటి తరం” నవల అవ్విష్కరణ సభ ఆయన స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా, కొండపాక మండలం బందారంలో జరిగింది.
నేటినిజం పత్రిక సంపాదకులు, కవి బైసా దేవిదాస్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ప్రముఖ కవి, రచయిత వాసిరెడ్డి నవీన్ నవలను అవిష్కరించగా, ఆత్మీయ అతిథులుగా ప్రముఖ కవి గాయకులు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, టిఎన్జిఓల సంఘం మాజీ అధ్యక్షులు దేవిప్రసాద్ రావు, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కే.విరాహత్ అలీ, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు నాలేశ్వరం శంకరం, ప్రముఖ కవులు కందుకూరి శ్రీరాములు, భగవాన్ రెడ్డి, సిద్దంకి గిరి, తైదల అంజయ్య, మల్లారెడ్డి, తోట అశోక్ లతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.
