ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు, సవాళ్లు, సమస్యలను అధిగమించి భగీరథ ప్రయత్నంతో, గొప్ప సంకల్పంతో వెలిగొండ ఫేజ్-1ను పూర్తి చేసి కరువు నేలకు కృష్ణమ్మ జలాలను అందించబోతున్నాం అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.
తీవ్ర కరువు ప్రాంతంగా, అత్యంత వెనుకబాటుతనంతో ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల జీవితాలు మార్చేందుకు 30 ఏళ్ల క్రితం తీసుకున్న సంకల్పం నేడు సాకారమైంది. ఉమ్మడి రాష్ట్రంలో నాడు ముఖ్యమంత్రిగా 1996 మార్చి 5న వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాను. మూడు దశాబ్దాల తర్వాత అదే ప్రాజెక్టును నా చేతుల మీదుగా ప్రారంభిస్తున్నాను.
10.7 టీఎంసీల నీటిని నల్లమల సాగర్ కు రీలిజ్ చేయబోతున్నాం. ఈ చారిత్రక ఘట్టానికి ఈ నెల 31వ తేదీ మార్కాపురం జిల్లా వేదిక కాబోతోంది అని ఆయన ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. ఫేజ్-1తో 1.19 లక్షల ఎకరాలకు… ఫేజ్-2తో 3.283 లక్షల ఎకరాలకు సాగునీరును అలాగే లక్షలాది మందికి తాగునీటితో తరతరాలుగా కరువుతో పోరాడిన ప్రజలకు ఉపశమనం కల్పించడమే మా లక్ష్యం.
దుర్భిక్ష ప్రాంతమైన మార్కాపురానికి వెలిగొండ… వెలుగుల దండ అవుతుంది. వెలిగొండ జల విజయంతో కరువు ప్రాంతంలో కృష్ణమ్మతో జలహారతి ఇస్తున్నాం. నెర్రలు బారిన నేలను కృష్ణా జలాలతో తడపబోతున్నాం. 31వ తేదీ నుంచి మొదలయ్యే వెలిగొండ జలసిరులు… ఈ ప్రాంత అభివృద్ధికి రెక్కలు తొడుగుతుంది.
ఈ జలంతో జీవం-జీవితం… సాగు–బాగు. పశ్చిమ ప్రకాశం ప్రజల ఎన్నో ఏళ్ల కల అయిన మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసి ఆ ఆకాంక్షను నెరవేర్చాం. రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం జిల్లాలను హార్టికల్చర్ హబ్గా చేసేందుకు రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులతో త్వరలో పనులు ప్రారంభిస్తున్నాం. నేషనల్ హైవేలు, పోర్టులతో ఈ ప్రాంతానికి లాజిస్టిక్స్ లోటు లేకుండా చేస్తున్నాం.
బెంగుళూరు-అమరావతి హైవే, రామాయపట్నం పోర్టులతో వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త ద్వారాలు తెరుస్తున్నాం. ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు ఇచ్చి పశ్చిమ ప్రకాశం ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం.
ప్రజల జీవితాలు మార్చాలి, వెనుకబాటును దూరం చేయాలనే గట్టి పట్టుదలతో శ్రీశైలం మల్లన్న నుంచి మార్కాపురం చెన్నకేశవుని చెంతకు కృష్ణమ్మను తీసుకువస్తున్నాం అని చంద్రబాబు ప్రకటించారు. ప్రతి రైతు పొలానికి నీరు… ప్రతి యువకుడికి ఉపాధి… ప్రతి కుటుంబానికి భరోసా… ఇదే ‘సీబీఎన్ అనే నేను’ సంకల్పం. ప్రతి పౌరుడూ అనే నేను స్ఫూర్తితో పనిచేసి వ్యక్తిగత విజయాలు సాధిస్తూ జాతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నాను అని చంద్రబాబునాయుడు అన్నారు.
