భారత క్రికెట్ స్టార్ స్మృతి మంధాన వివాహానికి మరో అడ్డంకి ఏర్పడింది. నవంబర్ 23న, స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన గుండెపోటు లక్షణాలతో సాంగ్లీ లోని ఆసుపత్రికి అత్యవసరంగా తరలించబడ్డారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో, స్మృతి తన వివాహ ఏర్పాట్లన్నింటిని పక్కన పెట్టి, తండ్రి కోలుకోవడమే ప్రాధాన్యమని నిర్ణయించుకుంది. తాజాగా ఆమెకు కాబోయే భర్త, సంగీత దర్శకుడు పలాష్ ముఛల్ వైరల్ ఇన్ఫెక్షన్ మరియు యాసిడిటీ సమస్యలతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఇక మరోవైపు, వరుడు పలాష్ ముఛల్ కూడా సోమవారం రోజు అనారోగ్యం పాలు కావడంతో వివాహ వేడుకను అనిశ్చితంగా వాయిదా వేసారు. స్మృతి వివాహం కోసం అత్యంత ఆతృతగా అభిమానులు ఎదురుచూస్తున్న సమయంలో మంధాన కుటుంబాన్ని వైద్య అత్యవసరత కుంగదీసింది.
స్మృతి కాబోయే భర్త పలాష్ ముఛల్ ను అదే రోజు వైద్యులు డిశ్చార్జి చేశారు. మంధాన కుటుంబ వైద్యుడు డాక్టర్ నమన్ షా చెప్పినదాని ప్రకారం, శ్రీనివాస్ కార్డియాక్ ఎంజైమ్స్ పెరిగి ఉండటం, రక్తపోటు అధికంగా ఉండటం వల్ల ఆయనను క్షుణ్ణంగా పరిశీలనలో ఉంచినట్లు తెలిపారు. ఈ విషయం పై స్మృతి మేనేజర్ తుహిన్ మిశ్రా మాట్లాడుతూ, స్మృతికి స్పష్టమైన అభిప్రాయం ఉంది. ముందుగా తండ్రి ఆరోగ్యం బాగుపడాలి. ఆ తర్వాతే పెళ్లి విషయం అని చెప్పారు. అయితే ఈ సమయంలో కుటుంబానికి గోప్యత ఇవ్వాలని ఆయన కోరారు. ఇదివరకు వారి సంగీత్, హల్దీ వంటి ప్రీ-వెడ్డింగ్ వేడుకలు సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన హైలైట్ అయ్యాయి. అయితే ప్రస్తుతం అన్ని వేడుకలు పూర్తిగా నిలిపివేయబడ్డాయి.
