కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కు టీడీపీ నాయకత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. అమరావతి రాజధాని ప్రాంతం.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు పార్లమెంటు స్థానం పరిధిలోకి వస్తుంది. అందుకే రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించే బాధ్యతను ఆయన చేతిలో పెట్టారు సీఎం చంద్రబాబు. అమరావతి కోసం విభజన చట్టానికి సరవణ చేసే బిల్లును శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటు ముందుకు తీసుకురావాలని ప్రయత్నించారు.
అయితే లీగల్ ఇష్యూస్ రావడంతో.. ఈ బిల్లును న్యాయశాఖ పరిశీలనకు పంపారు. న్యాయ పరమైన సమస్యలను అధిగమించి.. అమరావతికి చట్టబద్దత కల్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. బడ్జెట్ సమావేశాల నాటికి గెజిట్ నోటికేషన్ విడుదలయ్యేలా చూసే పనిని పెమ్మసాని భుజాల మీద పెట్టారు. 2019 నుంచి ఐదేళ్ల పాటు అప్పటి జగన్ ప్రభుత్వం రాజధానితో మూడు ముక్కలాట ఆడింది. మరోసారి ఇలాంటి సమస్య రాకుండా.. అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కూటమి ప్రభుత్వం పట్టుదలతో ఉంది.
కేంద్ర ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖల్లో సహాయ మంత్రిగా పని చేస్తున్న పెమ్మసానికి ఇంకో ముఖ్యమైన పని అప్పగించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లు, నిధులు సకాలంలో విడుదలయ్యేలా ఢిల్లీ పెద్దలతో సమన్వయం చేసుకొనే పని అప్పగించారు. రాష్ట్రానికి అవసరమైన నిధులు, ఆర్ధిక సాయం విషయంలో కేంద్రం ఉదారంగా స్పందించి.. భారీ ప్యాకేజీలు ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణం సహా.. రోడ్లు, రైల్వేలు, పోర్టులు.. ఇతర కేంద్ర ప్రయోజిత పథకాల నిధులను ఎప్పటికప్పుడు రిలీజ్ చేయించడానికి పెమ్మసాని కృషి చేస్తున్నారు.
సీఎం చంద్రబాబు తనకు భారీ హోం వర్క్ ఇచ్చారని చెప్పారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగంగా సాగేందుకు వీలుగా కేంద్ర నుంచి నిధులు తీసుకొచ్చే బాధ్యతను తనకు అప్పగించారని ఆయన తెలియజేశారు. పెమ్మసాని చొరవతో.. అమరావతిలో కాగ్ కార్యాలయం, రాష్ట్ర స్థాయి పోస్టాఫీసు, 100 పడకల ఆయుర్వేద ఆసుపత్రి, యోగా సెంటర్ల నిర్మాణానికి కేంద్ర ఆమోద ముద్ర వేసింది.
గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి కోసం రాష్ట్రంతో పాటు కేంద్రం నుంచి భారీ స్థాయిలో నిధులు, ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు పెమ్మసాని చంద్రశేఖర్. ఆయన ఎంపీగా ఉన్న సమయంలో రాజధాని నిర్మాణం పూర్తి చేసుకోవడం విశేషం.
