వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం, ఆయన అడ్డా పులివెందులలో సీన్ రివర్స్ అవుతోందా.?? జగన్ బలం తగ్గుతోందా.?? లేక ఆయన పెట్టిన భయం తగ్గుతోందా..?? రెండు ఓటములతో సొంత గడ్డలో జగన్కి వ్యతిరేకత మొదలయిందా..?? ఇన్నాళ్లూ గుప్పిట దాచి ఉంచిన రాజారెడ్డి రాజ్యాంగం, రాజారెడ్డి రూలింగ్కి చెక్ పడిందా..?? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది..
జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జగన్ అనుచరుడు, వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి అలియాస్ దిల్ మాంగే తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రశేఖర్ రెడ్డి అలియాస్ దిల్ మాంగే వైసీపీకి, వైఎస్ ఫ్యామిలీకి కీలక అనుచరుడిగా ముద్రపడ్డాడు.. వేంపల్లె మండలంలో ఓటింగ్ని శాసించగల నేతగా ఆయనకు ముద్ర ఉంది..
వైఎస్ వివేకా హత్య, సునీత కన్నీరు.. వివేకా ఫ్యామిలీకి జరుగుతోన్న అన్యాయంతో వీరు రగిలిపోతున్నారు.. ఇటు, జగన్ మోహన్ రెడ్డి, నియోజకవర్గాన్ని వైఎస్ అవినాష్ రెడ్డికి అప్పగించడం కూడా వీరికి నచ్చడం లేదని తెలుస్తోంది. అందుకే, ముఖ్యనేతలు సైతం జగన్కి దూరంగా జరుగుతున్నారు..
టీడీపీలో వరస చేరికలతో పులివెందులలో రాజకీయం రంజుగా మారుతోంది.. మూడు దశాబ్దాలుగా అక్కడి ప్రజలను బెదిరించిన వైఎస్ ఫ్యామిలీ హవా తగ్గుతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది.. జగన్ మోహన్ రెడ్డి నియోజకవర్గంలో వైసీపీ నేతలు, టీడీపీలోకి జంప్ అవుతున్నారు.. ముఖ్యంగా వేంపల్లిలో చేరికల కార్యక్రమం ఊపందుకుంది.
ఇటీవల రెండు వందల కుటుంబాలు జగన్ని గుడ్ బై చెప్పి, సైకిల్ ఎక్కారు.. టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు.. తాజాగా, మరికొంత మంది వైసీపీ నేతలు తెలుగు దేశంలో చేరారు… వేంపల్లి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి మరీ పసుపుకండువా కప్పుకున్నారు.. ఈ పరిణామం జగన్కి మింగుడు పడడం లేదు.. సొంత నియోజకవర్గంలో పట్టు కోల్పోతున్నారనే వాదన వినిపిస్తోంది.. మరి, ఈ జంపింగ్ జపాంగ్లకి జగన్ ఎలాంటి చెక్ పెడతారో చూడాలి..
