వైసీపీ సీనియర్ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. మాచవరం పోలీస్ స్టేషన్లో వంశీపై మరో కేసు నమోదైంది. సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో వంశీపై కేసు నమోదు చేశారు పోలీసులు. 2024లో జులైలో తనపై వంశీ ఆయన అనుచరులు దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వంశీతో సహా మరో 8 మందిపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇప్పటికే 11కుపైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు కావడం రాజకీయవర్గాల్లో హాట్టాపిక్గా మారింది. టీడీపీ కార్యకర్త సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో గతంలో వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు పోలీసులు..ఫిబ్రవరి 16వ తేదీన అరెస్ట్ చేయగా..ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యారు.
వంశీపై ఇప్పటివరకు నమోదైన కేసుల చిట్టా చాలా పెద్దదిగానే ఉంది. ప్రధానంగా 2023లో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటన, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ ఒక్క ఘటనలోనే కాకుండా, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న సత్యవర్థన్ను కిడ్నాప్ చేసి బెదిరించారనే అభియోగంపై కూడా ఆయనపై కేసు ఉంది. అదనంగా, గన్నవరం, ఆత్కూరు, వీరవల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో భూ వివాదాలు, అక్రమ మైనింగ్, బాధితులను బెదిరించడం వంటి ఆరోపణలపై ఫిబ్రవరి 2025లో వరుసగా కేసులు నమోదయ్యాయి.
వీటిలో సత్యవర్ధన్ను బెదిరించిన కేసులో సుమారు 140 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇటీవల బెయిల్పై బయటకు వచ్చినప్పటికీ, పాత ఫిర్యాదులు, కొత్త కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజా కేసుతో మరోసారి చిక్కులు తప్పవనే మాట వినిపిస్తోంది.
