మాజీ సీఎం జగన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఇది హత్యకు సూత్రధారులైన వారికి మింగుడుపడని విషయమే. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేయడంతో వారిలో ఆందోళన తలెత్తి ఉంటుంది. ఈ కేసులో దర్యాప్తు పూర్తి అయిందని సీబీఐ చెబుతున్న నేపథ్యంలో, ఇంకా ఏమైనా లోతైన విచారణ అవసరమా? అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది.
న్యాయమూర్తులు ఎం.ఎం. సుంద్రేష్, శతీశ్ చంద్రమ్ శర్మలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. “దర్యాప్తు పూర్తయిందని మీరు చెబుతున్నారు. అయితే ఇంకా ఏ అంశాలపై లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు? దానిపై స్పష్టమైన వివరాలు ఇవ్వాలి” అని సీబీఐని ప్రశ్నించింది. వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో ఈ అంశం సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది.
కేసులో ఇంకా కీలక అంశాలు బయటపడలేదని, కొందరికి ఇచ్చిన బెయిల్ను రద్దు చేసి మరింత లోతైన దర్యాప్తు చేపట్టాలని ఆమె కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు, సీబీఐ తన వాదనలను స్పష్టంగా నమోదు చేయాలని సూచించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 5, 2026కి వాయిదా వేసింది.
అప్పటివరకు కేసులో మరింత దర్యాప్తు అవసరమా? లేదా ట్రయల్ కోర్టులో విచారణ కొనసాగించాలా? అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది. దీంతో, వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయపరమైన ప్రక్రియ ఇంకా ముగియలేదని, సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని గట్టిగా పర్యవేక్షిస్తోందని స్పష్టమవుతోంది.
