అమరావతి రాజధాని అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడిందని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. అమరావతిలో సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్ (సీజీజీపీఓఏ) ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సామాజిక మాధ్యమ వేదికలో స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని నరేంద్రమోడీకి, కేంద్ర మంత్రివర్గానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రాతినిధ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.
ఆధునిక సాంకేతికతతో పాటు పర్యావరణ అనుకూల విధానాల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయ భవనాల నిర్మాణానికి ఆమోదం లభించడం అమరావతి అభివృద్ధిలో మరో కీలక ఘట్టమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాజధానిగా అమరావతి భవిష్యత్తు వృద్ధికి అవసరమైన పరిపాలనా మౌలిక సదుపాయాల కల్పనలో ఈ ప్రాజెక్టు ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పారు.
అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఒకే ప్రాంగణంలోకి తీసుకురావడం ద్వారా పరిపాలనా వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారుతుందని తెలిపారు. అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, మద్దతుకు ఈ నిర్ణయం నిదర్శనమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
