రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఉధృత రూపం దాల్చుతోంది. సమ్మెలో భాగంగా మొదటి రోజు పోరాటాన్ని విజయవంతం చేసిన కార్మికులకు ఆర్టీసీ జేఏసీ నాయకత్వం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది. ఇదే ఉత్సాహంతో రేపటి కార్యాచరణను కూడా జేఏసీ ప్రకటించింది. రేపు ఉదయం 5 గంటల నుండే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల ఎదుట ‘మహా ధర్నాలు’ చేపట్టాలని కార్మికులకు పిలుపునిచ్చింది.
ప్రభుత్వం మరియు యాజమాన్యం తీరుపై జేఏసీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చల పేరుతో కాలయాపన చేస్తూ కార్మికులను, ప్రజలను ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తోందని వారు విమర్శించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ తమ వల్ల ఏమీ కాదంటూ చేతులెత్తేయడం వారి చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోందని మండిపడ్డారు.
తమ ప్రధాన డిమాండ్ల సాధన వరకు వెనకడుగు వేసే ప్రసక్తి లేదని జేఏసీ స్పష్టం చేసింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, 2021 వేతన సవరణను 30 శాతం తగ్గకుండా అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే హైదరాబాద్లో ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశాన్ని రద్దు చేయాలని, ఉద్యోగులను ఇతర జోన్లకు బదిలీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు.
వీటితో పాటు కార్మిక సంఘాలను పునరుద్ధరించి, గుర్తింపు సంఘం ఎన్నికలను వెంటనే నిర్వహించాలని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని జేఏసీ తేల్చి చెప్పింది.
