అమెరికా మొండి వైఖరి కారణంగా హోర్మోజ్ జల సంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అణ్వస్త్ర కార్యక్రమం సహా అన్ని అంశాలపై తమతో తుది ఒప్పందాన్ని కుదుర్చుకునే దాకా ఇరాన్ ఓడరేవుల ముట్టడిని ఆపేది లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి అనుగుణంగా హోర్మోజ్ను పూర్తిగా తెరిచినట్లు శుక్రవారమే ఇరాన్ ప్రకటించింది.
అయినప్పటికీ తమ ఓడరేవుల ముట్టడిని అమెరికా కొనసాగిస్తున్నందుకు నిరసనగా, కొన్ని గంటల్లోనే ఇరాన్ నిర్ణయాన్ని మార్చుకుంది. హోర్మోజ్ జలసంధి మార్గంలో మళ్లీ ఆంక్షలను అమల్లోకి తెచ్చామని ఇరాన్ జాయింట్ మిలిటరీ కమాండ్ శనివారం ప్రకటించింది. హోర్మోజ్ పరిసర ప్రాంతాలను మునుపటిలాగే తమ సైనిక దళాలు పకడ్బందీగా కంట్రోల్ చేస్తాయని తెలిపింది.
తమ ఓడరేవులను ముట్టడించడం ద్వారా కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఇరాన్ జాయింట్ మిలిటరీ కమాండ్ ఆరోపించింది. ఈ ముట్టడిని అమెరికా కొనసాగించినన్ని రోజులూ, హోర్మోజ్ ముట్టడిని తాము కొనసాగిస్తామని తేల్చి చెప్పింది.
