“ఆపరేషన్ వజ్రప్రహార్”లో బాగంగా విజయనగరం జిల్లా చీపురుపల్లి పోలీస్ సబ్ డివిజన్ రేగిడి ఆముదాలవలస పోలీస్ స్టేషన్ పరిధి చిన శిర్లాంలో శనివారం పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.సుమారు 120 గడపలలో సోదాలు చేసి సరైన రికార్డ్స్ లేని 13 బైక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 350 మంది ఇండ్లలో 70 మంది సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
అనుమానిత వ్యక్తులు పారిపోయేందుకు అవకాశం ఉన్న మార్గాలను ముందుగా గుర్తించి వాటిని మూసేసారు. స్థానిక గ్రామస్థులతో ముఖ్యంగా యువతతో చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు డ్రగ్స్ కు వ్యతిరేకం పై ప్రతిజ్ఞ చేయించారు. గంజాయి వలన కలిగే దుష్ప్రభావాలను వివరించారు. హిస్టరీ షీట్ ఉన్న వారితో మాట్లాడి, మీ కదలికలపై నిత్యం నిఘా ఉంటుందని డీఎస్పీ రాఘవులు స్పష్టం చేసారు.
గ్రామస్థుల రక్షణ, భద్రత, నేరాల కట్టడి కోసమే ఈ తనిఖీలని డీఎస్పీ రాఘవులు అన్నారు. గంజాయి నిర్మూలన, అనుమానిత వ్యక్తులు, నాటు తుపాకులు, నాటుసారా, అసాంఘిక కార్యకలాపాలు అరికట్టడమే కోసమే “కార్డన్ అండ్ సెర్చ్“ ఆపరేషన్ అని అన్నారు. ఏపీ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు, ఈగల్ చీఫ్ ఆకే రవి కృష్ణ పర్యవేక్షణలో జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఉత్తర్వుల మేరకు ఈ ‘కార్డన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్ చేపట్టారు.
రాబోయే రోజుల్లో “ఆపరేషన్ వజ్రప్రహార్” లో బాగంగా మరిన్ని ప్రాంతాల్లో “కార్డన్ అండ్ సెర్చ్” ఆపరేషన్స్ ఆకస్మికంగా చేపట్టనున్నామని చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు అన్నారు.ఈ తనిఖీల్లో రాజాం రూరల్ సీఐ ఉపేంద్ర,రేగిడి ఆముదాలవలస ఎస్ఐ షేక్ శంకర్,గోపాల్ లు మూడు పోలీస్ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు.
