ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని పీడిస్తున్న చక్కెర వ్యాధి (డయాబెటిస్) చికిత్సలో చైనా శాస్త్రవేత్తలు ఒక సంచలనాత్మక విజయాన్ని సాధించారు. స్టెమ్ సెల్ (కణజాల) చికిత్స ద్వారా ఒక రోగిలో ఉన్న టైప్-2 చక్కెర వ్యాధిని పూర్తిగా నయం చేసినట్లు షాంఘైకి చెందిన పరిశోధక బృందం ప్రకటించింది.
వైద్య చరిత్రలోనే ఇదొక అద్భుత ఘట్టంగా భావిస్తున్నారు. సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారు జీవితాంతం మందులు లేదా ఇన్సులిన్ ఇంజెక్షన్లపై ఆధారపడాల్సి ఉంటుంది. కానీ, ఈ కొత్త చికిత్స విధానం వల్ల సదరు రోగి గత కొంత కాలంగా ఎటువంటి ఇన్సులిన్ అవసరం లేకుండానే సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు.
ఈ చికిత్సలో భాగంగా రోగి సొంత రక్త కణాల నుంచి స్టెమ్ సెల్స్ను సేకరించి, వాటిని ప్రయోగశాలలో ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే ‘ఐలెట్’ కణాలుగా మార్చారు. అనంతరం ఈ కణాలను రోగి శరీరంలోకి ప్రవేశపెట్టారు. ఫలితంగా రోగి శరీరంలో సహజంగానే ఇన్సులిన్ ఉత్పత్తి కావడం ప్రారంభమైంది.
దీనివల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వచ్చాయి. ఈ పరిశోధన విజయవంతం కావడంతో భవిష్యత్తులో డయాబెటిస్ బాధితులకు ఇన్సులిన్ సూదుల నుంచి విముక్తి లభించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఇది ప్రారంభ దశలో ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో టైప్-1 డయాబెటిస్ రోగులకు కూడా ఈ విధానం వరంగా మారుతుందని వైద్య నిపుణులు భావిస్తున్నారు.
