వైసీపీ నేతల మహా పాపం బయటపడింది. గడిచిన ఐదేళ్లలో తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు ఏపీలోని శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం సహా ప్రముఖ దేవాలయాలకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన విధానాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ బయటపెట్టింది. వైసీపీ ఐదేళ్ల పాలనలో భోలేబాబా డెయిరీ దాదాపు 68 లక్షల కిలోల కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్లు రిపోర్టు ఇచ్చింది.
సరఫరా చేసిన కల్తీ నెయ్యి విలువ దాదాపు రూ.250 కోట్లుగా తేల్చింది. మొత్తం కల్తీ నెయ్యిలో రూ.137.22 కోట్ల విలువైన 37.38 లక్షల కిలోల నెయ్యిని తిరుపతి జిల్లా పునబాకలోని శ్రీవైష్ణవి డెయిరీ ద్వారా భోలేబాబా కంపెనీ పంపింది. ఐతే ఈ స్కామ్ మరింత లోతుగా ఉందని తెలిపింది. తమ నుంచి వైష్ణవి సంస్థ కొనుగోలు చేసినట్లు ఆశిష్ అగర్వాల్ అనే వ్యక్తి సహకారంతో భోలేబాబా డెయిరీ నకిలీ రికార్డులు తయారు చేసినట్లు సిట్ అధికారులు పేర్కొన్నారు.
మిగతా కల్తీ నెయ్యిని AR డెయిరీ, మాల్గంగా, భోలేబాబా సంస్థలు TTDకి విక్రయించాయని, మొత్తంగా నకిలీ నెయ్యి సరఫరా ద్వారా భోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్ రూ.251.53 కోట్లు ఆర్జించినట్లు వెల్లడించారు. పామాయిల్కు ఆవు నెయ్యిలా సువాసన వచ్చేలా, నాణ్యతా పరీక్షల్లో ఎక్కడా దొరక్కుండా రసాయనాలు కలిపారని సిట్ తేల్చింది.
ఈ నెల ఏడున అరెస్టైన అజయ్కుమార్ సుగంధ్ రిమాండ్ రిపోర్టులో ఈ వివరాలు ఉన్నాయి. ఇతను నెయ్యి కల్తీకి అవసరమైన రసాయనాలను పొమిల్, విపిన్ జైన్లు డైరెక్టర్లుగా ఉన్న హర్ష్ ఫ్రెష్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, హర్ష్ ట్రేడింగ్ కంపెనీలకు పంపారని విచారణలో వెల్లడైంది. తద్వారా అజయ్కుమార్కు రూ.7.94 కోట్లు ముట్టాయని సిట్ తేల్చింది.
AR డెయిరీ ద్వారా వచ్చిన 4 ట్యాంకర్ల కల్తీ నెయ్యిని ఒకసారి వెనక్కు పంపగా రంగంలోకి దిగిన భోలేబాబా డెయిరీ వాటిని తిరిగి శ్రీవైష్ణవి డెయిరీ పేరుతో సరఫరా చేయగా TTD వాటిని అనుమతించినట్లు రిమాండ్ రిపోర్టులో ఉంది. ఈ కేసులో ఇద్దరు TTD ఉద్యోగులు A-9, A-10గా ఉన్నారు.
