600 కోట్ల రూపాయల డ్రగ్ డైవర్షన్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కళా ఆంబ్ కేంద్రంగా పనిచేసే ఫార్మాస్యూటికల్ కంపెనీ ‘డిజిటల్ విజన్’ యజమానులైన అంబాలాకు చెందిన పర్షోతమ్ లాల్ గోయల్, ఆయన కుమారులు కానిక్ గోయల్, మానిక్ గోయల్లపై ఎన్సీబీ నాన్–బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.
డిజిటల్ విజన్ సంస్థ ఏడాది ఏడు రాష్ట్రాల్లో మానసిక ఉద్దీపన కలిగించే నిషేధిత డ్రగ్స్ను అక్రమంగా సరఫరా చేసిన కేంద్ర బిందువుగా ఉందని దర్యాప్తు సంస్థ వెల్లడించింది. నవంబర్ 1న సంస్థ భాగస్వామి అనూజ్కుమార్ అరెస్టు తరువాత ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
తదనంతరం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సంస్థ పై విస్తృత దాడులు నిర్వహించింది. దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు 611 కిలోల సైకోట్రోపిక్ పౌడర్, 573 కిలోల ట్రామడాల్ బల్క్ మిశ్రమం, 12 లక్షల సైకోట్రోపిక్ మాత్రలు, 50,000 ట్రామడాల్ అంపూల్స్, 5,000 మిడాజోలామ్ వైల్స్ను ఎన్సీబీ స్వాధీనం చేసుకుంది.
తాజా సీజ్తో మొత్తం 34 లక్షల సైకోట్రోపిక్ మాత్రలు, 10.57 లక్షల కఫ్ సిరప్ సీసాలు, 1,613 కిలోల ముడి పదార్థం, 573 కిలోల ట్రామడాల్ బల్క్ మిశ్రమం ఏజెన్సీ చేతికి చిక్కాయి. మొత్తం విలువ దాదాపు 600 కోట్ల రూపాయలకు చేరుతోందని అంచనా. ఇప్పటివరకు 15 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
కంపెనీ జోధ్పూర్, డెహ్రాడూన్లలో కాగితాలపై మాత్రమే ఉన్న నకిలీ డిస్ట్రిబ్యూటర్ సంస్థలకు భారీగా ట్రామడాల్ క్యాప్సూల్స్, కోడీన్ ఫాస్ఫేట్ కఫ్ సిరప్ను సరఫరా చేసి, ఇంటర్స్టేట్ స్థాయిలో భారీ అక్రమ రవాణా నెట్వర్క్ను నడిపిందని ఎన్సీబీ వెల్లడించింది.
డిజిటల్ విజన్పై ఇంతకుముందు కూడా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. 2020లో ఈ సంస్థ తయారు చేసిన ఒక కఫ్ సిరప్ కారణంగా ఉధమ్పూర్లో 12 శిశువులు మృతిచెందిన ఘటనతో కంపెనీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.
