అమరావతిలో నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. సెక్రటేరియట్, HODల భవనాలను అత్యంత ఆధునికమైన డయాగ్రిడ్ టెక్నాలజీతో నిర్మిస్తున్నారు. లండన్లోని 30 సెయింట్ మేరీ యాక్స్, మన్హటన్లోని హెరస్ట్ టవర్ వంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కట్టడాల సరసన ఇప్పుడు అమరావతిలోని 5 ఐకానిక్ టవర్లు చేరబోతున్నాయి. ఇంత భారీ స్థాయిలో, పూర్తి డయాగ్రిడ్ టెక్నాలజీతో ఆకాశహర్మ్యాలను నిర్మించడం దేశంలో ఇదే ఫస్ట్ టైం.
సంప్రదాయ భవనాల్లో ఉండే నిలువు స్తంభాలు ఈ నిర్మాణంలో కనిపించవు. భవనం మధ్యలో వెన్నెముకలా ఒక కోర్వాల్ ఉండి, దాని చుట్టూ దృఢమైన ఇనుప స్తంభాలను త్రిభుజాకారపు షెల్లా అమర్చుతారు. ఈ షెల్కే మందపాటి గాజు పలకలను బిగిస్తారు. ఈ విధానం వల్ల గ్రావిటీ లోడ్తో పాటు గాలులు, భూకంపాల వంటి ప్రకృతి విపత్తులను భవనం సమర్థవంతంగా తట్టుకుంటుంది. లోపల స్తంభాలు లేకపోవడం వల్ల కార్యాలయాల కోసం పూర్తి స్థాయి స్థలం అందుబాటులోకి వస్తుంది.
ప్రతి టవర్లో 26×23 మీటర్ల విస్తీర్ణంతో నిర్మించే కోర్వాల్లోనే కీలక సదుపాయాలన్నీ ఉంటాయి. లిఫ్టులు, మరుగుదొడ్లు, పాంట్రీ, అగ్నిమాపక వ్యవస్థలన్నీ లోపలే వస్తాయి. GAD టవర్లో 16, మిగిలిన నాలుగు టవర్లలో 15 చొప్పున హైస్పీడ్ లిఫ్టులను ఏర్పాటు చేస్తున్నారు. ఒకే ఛాంబర్లో రెండు కాప్స్యూల్స్ ప్రయాణించేలా డ్యూయల్ కాప్స్యూల్ సాంకేతికతను వాడుతూ, అవి ఢీకొనకుండా యాంటీ కొలిజన్ ఇన్స్ట్రుమెంట్లను అమరుస్తున్నారు.
5 ప్రధాన టవర్లతో పాటు, వాటి అనుబంధ అవసరాల కోసం 9 ఎమినిటీస్ బ్లాక్స్ నిర్మిస్తున్నారు. వీటిలో సీఎం అర్జీల స్వీకరణ హాలు, బ్యాంకులు, జిమ్, స్విమ్మింగ్ పూల్, లైబ్రరీ వంటి సౌకర్యాలు ఉంటాయి. ఈ బ్లాకులపై టెర్రస్ గార్డెన్లను అభివృద్ధి చేస్తారు. అలాగే 1.60 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీట్తో నిర్మించే భారీ పోడియంలో ఒకేసారి 4,000 కార్లు పార్క్ చేసేలా అత్యంత విశాలమైన వసతి కల్పిస్తున్నారు.
ఈ ప్రాజెక్టు కోసం సుమారు ఒక లక్ష టన్నుల స్ట్రక్చరల్ స్టీల్ను వినియోగిస్తున్నారు. ఒక్కో జంక్షన్ బాక్స్ బరువే 20 నుంచి 32 టన్నుల వరకు ఉంటుంది. భవనం బయటకు పెద్ద పెద్ద డైమండ్ ఆకృతులతో కళ్లు చెదిరేలా కనిపిస్తుంది. ఒక్క ఈ భవనాలకు అమర్చే గాజు పలకల కోసమే సుమారు రూ. 2,500 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ నిర్మాణం పూర్తయితే అమరావతికి వచ్చే పర్యాటకులను ఆకర్షించే ప్రధాన కేంద్రంగా నిలవనుంది.
