రాజకీయాల్లో పరస్పరం తీవ్రంగా విభేదిస్తూ పొట్లాడుకునే పార్టీలు, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మునిసిపాలిటీ ఎన్నికల ప్రచారంలో మాత్రం ఒక్కటయ్యాయి. సాధారణంగా ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలతో రాజకీయ యుద్ధం చేసే కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన, వైయస్ఆర్సీపీ పార్టీలు సత్తుపల్లిలో మాత్రం కలిసికట్టుగా రోడ్షోలో పాల్గొని మిత్రత్వ రాజకీయానికి ఉదాహరణగా నిలిచాయి.
నాలుగు పార్టీల జెండాలు ఒకే వేదికపై దర్శనమివ్వడం స్థానికంగా ఆసక్తికర చర్చకు దారి తీసింది.సత్తుపల్లి పట్టణ శివారు నుంచి సుభాష్ చంద్రబోస్ విగ్రహం వరకు నిర్వహించిన రోడ్షోలో కాంగ్రెస్తో పాటు తెలుగుదేశం, జనసేన, వైయస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొని ఎన్నికల ప్రచారంలో భాగమయ్యారు.
ఈ సందర్భంగా జరిగిన కార్నర్ మీటింగ్లో మాట్లాడిన వక్తలు, గతంలో అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. ప్రస్తుత పాలనలో సత్తుపల్లిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని మునిసిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా నాలుగు పార్టీల శ్రేణులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
