డ్వాక్రా మహిళల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకురావాలనే ఆలోచనలో ఉంది. రాష్ట్రంలో మహిళల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అయితే గ్రామీణ ప్రాంత మహిళల్లో చాలా మందికి.. గవర్న్మెంట్ స్కీమ్స్కి సంబంధించి సరైన అవగాహన ఉండటం లేదు. డ్వాక్రా సంఘాల కోసం ఎలాంటి పథకాలు అమలవుతున్నాయో.. ఆ గ్రూపుల్లోని వారికే తెలియని పరిస్థితులు కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి. ఈ సమస్యని పరిష్కరించడంతో పాటు డ్వాక్రా మహిళల్లో కొందరికి ఆర్ధిక భరోసా కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నారీ అనే కాన్సెప్ట్ని తెరపైకి తీసుకొచ్చింది.
డ్వాక్రా మహిళలకు ఉపయోగపడేలా ప్రభుత్వం మన డబ్బులు – మన లెక్కలు లాంటి మొబైల్ అప్లికేషన్లు తీసుకొస్తోంది. వీటిని ఉపయోగించాలంటే మహిళలకు టెక్నాలజీ తెలిసి ఉండాలి. డ్వాక్రా సంఘాల్లో యాక్టివ్గా ఉంటూ.. టెక్నాలజీపై పట్టున్న మహిళలను ఈ నారీలుగా నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. వీరి ద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లోని ఇతర మహిళలకు అవగాహన కల్పించాలని అనుకొంటున్నారు. ప్రభుత్వ పథకాల కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. డ్వాక్రా లోన్ల ఈఎంఐలను ఆన్లైన్లో ఎలా చెల్లించాలి వంటి అంశాలను వీరు డ్వాక్రా సంఘం సభ్యులకు వివరించాల్సి ఉంటుంది. ప్రతి రెండు లేదా మూడు గ్రూపులకు ఒక ఈ నారిని నియమిస్తారు.
డ్వాక్రా సంఘంలో సభ్యురాలిగా ఉంటూ.. 15 నుంచి 45 ఏళ్ల మధ్య వయసులో ఉన్న వారు ఈ నారీ పోస్టు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి పదో తరగతి పాస్ కనీస విద్యార్హతగా నిర్ణయించారు. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ వినియోంపై అవగాహన ఉండాలి. ఈ నారీ పథకం దరఖాస్తుల కోసం గ్రామ/వార్దు సచివాలయం లేదా.. సెర్ప్ కార్యాలయాలను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. ఎంపికైన వారికి ప్రోత్సాహక వేతనం లేదా ఆర్ధిక భరోసా కల్పించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఒక రకంగా ఇది పార్ట్టైమ్ గవర్నమెంట్ జాబ్ లాంటిదని చెప్పాలి.
