నరసాపురం లేసులు… ఎంతో స్పెషల్.. వీటికి 200 ఏళ్ల చరిత్ర ఉంది.. అంటే నరసాపురం లేసులకి ఎంతటి ప్రత్యేకత ఉందో చెప్పాల్సిన పనిలేదు.. ఈ ప్రత్యేకతే ప్రధాని నరేంద్ర మోదీని సైతం ఆకర్షించింది. తన తాజా మన్ కీ బాత్లో వీటిపై ప్రత్యేకంగా చర్చించారు ప్రధాని మోదీ..
నరసాపురం లేసుల ప్రత్యేకత ఏంటంటే.. వాటి సున్నితమైన పనితనం, రంగుల కలయిక, సాంప్రదాయక డిజైన్లతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఇవి పూర్తిగా చేతులతో, ప్రత్యేకమైన నైపుణ్యంతో అల్లినవి. అత్యంత నాణ్యమైన పత్తి దారాలు, వివిధ పరిమాణాల స్పెషల్ సూదులు ఉపయోగిస్తారు. డోలీలు, దిండు కవర్లు, బెడ్స్ప్రెడ్లు, టేబుల్ రన్నర్లు, పర్సులు, మొబైల్ కవర్లు, స్టోల్స్ వంటివి తయారు చేస్తారు.
ఇవి కేవలం ఉపయోగకరమైన వస్తువులే కాక, కళాత్మకతకు ప్రతీకలు. 19వ శతాబ్దం మధ్యలో ప్రారంభమై, 150 సంవత్సరాల చరిత్ర ఉంది, ఇది పేదరికంలో ఉన్న మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. ఇటీవల వీటికి GI ట్యాగ్ లభించేలా చేసింది ఏపీ సర్కార్.. ఇది నాణ్యతకు, ప్రత్యేకతకు నిదర్శనం. ఎన్నో దశాబ్దాల నుండి US, UK, ఫ్రాన్స్ వంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. వేలాది మంది మహిళా కళాకారులకు ఇది జీవనోపాధి కల్పిస్తోంది..
వీటి ప్రత్యేకతని రెండున్నర దశాబ్దాల క్రితమే గుర్తించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. 2000లో నరసాపురం లేస్ పార్క్ను ఏర్పాటు చేశారు.. అంబేద్కర్ హస్త వికాస్ యోజన కింద ఈ హస్తకళను సంరక్షించేందుకు, ప్రోత్సహించేందుకు తీసుకున్న చొరవను డీఆర్డీఏ సద్వినియోగం చేసుకుని భారతదేశంలోనే తొలి లేస్ పార్క్ను నరసాపురంలో అభివృద్ధి చేసింది.
లేస్ పార్క్ ఏర్పాటుతో ఉత్పత్తుల విక్రయానికి కొంత మేర వ్యవస్థ ఏర్పడడంతో పాటు, కళాకారిణులకు నేరుగా మార్కెట్ చేరువైంది. తరతరాలుగా మహిళలే ఈ అరుదైన హస్తకళను కాపాడుతూ వచ్చారని, ఇప్పుడు దీనికి కొత్త హంగులు చేర్చి ఆధునికంగా ముందుకు తీసుకెళ్తున్నారని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
నరసాపురం లేస్ క్రాఫ్ట్కు ప్రధాని నరేంద్ర మోదీ గుర్తింపు ఇవ్వడంపై మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.
