జాతీయంహోమ్

అయోధ్య రాముడి సొమ్ము చోరీ కేసులో కీలక మలుపు

#Ayodhya

అయోధ్య రాముడిని కొల్లగొట్టిన వారి జాతకాలు మొత్తం ప్రత్యేక దర్యాప్తు బృందం బయటపెడుతున్నది. 2025లో జరిగిన మహా కుంభమేళా సమయంలో ఆలయానికి భారీగా విరాళాలు రావడంతో ఆశ పుట్టిన వీరు నగదు కొట్టేసినట్లు దర్యాప్తులో తేలింది.

ఈ కేసులో అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవ్ కుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్ పాండే, రామాశంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, రామశంకర్ యాదవ్ అలియాస్ తిన్నూ యాదవ్‌లను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. వీరంతా కలిసి ఆలయ హుండీలలోని నగదును అక్రమంగా అపహరించేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపిస్తున్నారు.

దర్యాప్తు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బావ, బావమరిది అయిన లవ్ కుష్ మిశ్రా, అనుకల్ప్ మిశ్రాలు అత్యధిక మొత్తాన్ని అపహరించి ఆ డబ్బుతో స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు అనుమానిస్తున్నారు. వీరికి సంబంధించిన ఆరుకి పైగా స్థిరాస్తులను ఇప్పటికే గుర్తించారు. వీరి ఆర్థిక లావాదేవీలపై సమగ్ర విచారణ జరపాలని ఆదాయపు పన్ను శాఖను కోరినట్లు సమాచారం. అలాగే ఈ నగదు అక్రమ మార్గంలో ఎలా తరలించబడిందన్న కోణంలో మరింత లోతైన దర్యాప్తు జరిపేందుకు కేంద్ర ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థతో కూడా విచారణ చేపట్టే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ కేసులో అత్యధిక నగదు అవినాష్ శుక్లా సమాచారం ఆధారంగానే స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు కాకముందే ఆయన ఇచ్చిన వివరాల ఆధారంగా 89 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అదనంగా ఆయన కుటుంబానికి సంబంధించిన యోగా కేంద్రంపై నిర్వహించిన దాడిలో మరో ఐదు లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

లవ్ కుష్ మిశ్రా పూర్వీకుల ఇంట్లో ఆవుపేడ కింద దాచిన 12 లక్షల రూపాయలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెలకు సుమారు 12 వేల రూపాయల వేతనం పొందే లవ్ కుష్ మిశ్రా, అక్రమంగా అపహరించిన నగదుతో తన భార్య పేరుపై అయోధ్యలో సుమారు 25 లక్షల రూపాయల విలువైన ఇల్లు నిర్మించినట్లు దర్యాప్తులో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు, ఇతరుల పేర్లపై ఉన్న ఆస్తుల వివరాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.

మనీష్ కుమార్ యాదవ్ ఇంటి నుంచి సుమారు 36 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే రామశంకర్ యాదవ్ అలియాస్ తిన్నూ యాదవ్ నివాసంలో నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ వ్యవహారంలో భారతీయ ప్రభుత్వ రంగ బ్యాంకుకు చెందిన కొంతమంది ఉద్యోగుల పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయానికి వచ్చే విరాళాల నగదు లెక్కింపు బాధ్యతను ఆ బ్యాంకు ఒక ప్రైవేటు సంస్థ సహకారంతో నిర్వహిస్తోంది. నాలుగు హుండీలలోని నగదును పద్నాలుగు మంది సభ్యులతో కూడిన బృందం లెక్కిస్తుంది. ఇందులో పదకొండు మంది బ్యాంకు సిబ్బంది, ముగ్గురు ఆలయ ట్రస్టు ప్రతినిధులు ఉంటారు.

నగదు లెక్కింపు గదిలో ప్రవేశానికి ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకుని కొందరు అంతర్గత సిబ్బంది సహకారంతో నిందితులు నగదును అక్రమంగా మళ్లించినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. నిందితుల ఆదాయ వనరులకు ఏమాత్రం సరిపోని విధంగా వారి బ్యాంకు ఖాతాల్లో భారీ ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.

Related posts

బ్లాక్ మార్కెట్ లో నకిలీ సిగరెట్లు

Satyam News

గిరిజన విద్యార్ధులకు అండగా మంత్రి నారా లోకేష్

Satyam News

భారత విమానయానంపై యుద్ధ ప్రభావం తీవ్రం

Satyam News

ఫ్యూచ‌ర్  సిటీ-బందరు పోర్ట్ గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారికి అనుమ‌తులు

Satyam News

లైసెన్స్డ్ సర్వేయర్లను నట్టేట ముంచిన రేవంత్ సర్కార్

Satyam News

నయనతార కు భర్త అంటే ఎంత ప్రేమో

Satyam News

Leave a Comment