గుంటూరు జిల్లా ఉండవల్లిలో నిన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతు పరిరక్షణ కమిటీ సభ్యులపై జరిగిన దాడి ఉదంతం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ, అమరావతి రైతుల పేరిట జరిగిన ఈ ఘర్షణలో ఒక పోలీస్ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలు కాగా, వైసీపీ నేతలకు చెందిన పలు కార్లు ధ్వంసమయ్యాయి. అయితే, దాడికి పాల్పడిన వారిని వదిలేసి, బాధితులైన వైసీపీ నాయకులు, పెనుమాక రైతులపైనే పోలీసులు కేసులు నమోదు చేయడం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. తమ విధులకు ఆటంకం కలిగించారంటూ తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.
ఈ ఘర్షణకు సంబంధించి వైసీపీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, దేవినేని అవినాష్, డయామండ్ బాబు, దొంతిరెడ్డి వేమారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, పానుగంటి చైతన్యతో పాటు పెనుమాకకు చెందిన రైతు శివారెడ్డి, నూనె ఉమామహేశ్వర్ రెడ్డి, నవరత్నాల మూర్తి మరికొంతమందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా బిఎన్ఎస్ సెక్షన్లు 189(2), 115(2), 118(1), 131, 351(2), 79, 190 లతో పాటు ఎస్సీ ఎస్టీ (POA) యాక్ట్ 2015లోని 3(1)(r), 3(1)(2) సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీనితో పాటు, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా ఇతరులపై సెక్షన్ 223, 132, 3(5) మరియు పోలీస్ యాక్ట్ 1861 లోని 30, 30(a) సెక్షన్ల ప్రకారం అదనపు కేసులు కూడా నమోదు చేసినట్లు సమాచారం.
