ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సదుపాయాలు, పరిశుభ్రత, ఔషధాల లభ్యత తదితర అంశాలపై ఆయన సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని వైద్య అధికారులు, సిబ్బందికి స్పష్టం చేశారు.
ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించేలా సేవల ప్రమాణాలను మెరుగుపరచాలని సూచించారు.
అనంతరం ప్రత్యేక ఓటరు సర్వే కార్యక్రమం (ఎస్ఐఆర్)లో భాగంగా ఖమ్మం నియోజకవర్గంలోని వీడీవో కాలనీలో జరుగుతున్న ఓటరు మ్యాపింగ్ ప్రక్రియను మంత్రి పరిశీలించారు. కార్యక్రమం పురోగతి, నిర్వహణ తీరుపై అధికారులతో చర్చించి అవసరమైన సూచనలు చేశారు.
