మహబూబ్నగర్ జిల్లా కేంద్రం పోలీస్ శాఖ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి జానకి మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ప్రైవేట్ బస్సులు నడుపుతున్న డ్రైవర్లు ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దని జిల్లా ఎస్పీ డి.జానకి,ఐపీఎస్ తెలిపారు.
అవసరమైన భద్రతా చర్యలు పోలీసు శాఖ తరఫున చేపట్టబడుతున్నాయని,డ్రైవర్లు నిరభ్యంతరంగా తమ విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజల రవాణా సౌకర్యాన్ని నిరవధికంగా కొనసాగించేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టిందని వెల్లడించారు.
ఆర్టీసీ బస్సులను ప్రైవేట్ వ్యక్తులు నడుపుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బస్సుల ప్రయాణానికి ఎలాంటి అడ్డంకులు సృష్టించినా, మార్గమధ్యంలో బస్సులను ఆపినా,డ్రైవర్లపై దాడులకు పాల్పడినా అలాంటి చర్యలను చట్టవిరుద్ధంగా పరిగణించి సంబంధిత వ్యక్తులపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజా రవాణా సేవలను భంగం కలిగించడం సహించబోమని స్పష్టం చేశారు.అదేవిధంగా ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టించడం,ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగించడం,అధికారులపై దాడులు చేయడం వంటి చర్యలకు పాల్పడిన వారిపై కూడా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం,వదంతులు వ్యాప్తి చేసే వారిపై కూడా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని, అలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.సమ్మెలో పాల్గొనే కార్మికులు మరియు ప్రజలు పరస్పర గౌరవంతో వ్యవహరించి ఎలాంటి ఉద్రిక్తతలకు తావు లేకుండా చూడాలని ఎస్పీ డి జానకి ఐపిఎస్ విజ్ఞప్తి చేశారు.
ప్రజల శాంతి భద్రతలను కాపాడటంలో పోలీస్ శాఖకు సహకరించాలని,ఎక్కడైనా అనుమానాస్పద పరిస్థితులు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు.
