హైదరాబాద్లో ఫుట్పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ , ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. బుధవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లో మున్సిపల్ అధికారులు పోలీసుల సహకారంతో ఆక్రమణలు తొలగించారు. రద్దీ ప్రాంతాలలో ఫుట్పాత్లను పాదచారులకు అందుబాటులోకి తెచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు, జరిమానాలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.
జీహెచ్ఎంసీ అధికారులు శాశ్వత దుకాణాల ఆక్రమణలు, తాత్కాలిక షెడ్లను జేసీబీలతో కూల్చివేస్తున్నారు. ఫుట్పాత్లను ఆక్రమించిన నిర్మాణాలను తొలగించే చర్యలు చేపట్టారు. పోలీస్ బందోబస్తు మధ్య కొనసాగుతున్న ఈ డ్రైవ్లో అధికారులు ఆక్రమణలను కూల్చివేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా కొన్ని చోట్ల చిరు వ్యాపారులు, అధికారుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి.
ఫుట్పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. రోడ్డును ఆక్రమించి డబ్బాలు, షెడ్లు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఫుట్పాత్లను స్వేచ్ఛగా ఉపయోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
నగరవ్యాప్తంగా ఇలాంటి ఆక్రమణలపై ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఫుట్పాత్ ఆక్రమణలను ఉపేక్షించబోమని, రోడ్లను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారి శ్రీనివాసరావు హెచ్చరించారు.
పాదచారుల సురక్షిత ప్రయాణానికి ఆటంకం కలిగిస్తున్న ఇలాంటి ఆక్రమణలపై చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు, ట్రాఫిక్ పోలీసుల సహకారంతో 6 జోన్లలో ఆక్రమణల తొలగింపు జరుగుతోంది. ఇతర రద్దీ ప్రాంతాల్లో ఫుట్పాత్లపై ఉన్న డబ్బాలు, షెడ్లు, అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఫుట్పాత్ ఆక్రమణల వల్ల పాదచారులు రోడ్లపై నడవాల్సి వస్తోంది, ఇది తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలకు, ప్రమాదాలకు దారితీస్తుందని అధికారులు పేర్కొన్నారు.
