మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాల మధ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని కీలకమైన ఫుజైరా ఓడరేవుపై డ్రోన్ దాడి జరిగింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడిలో ఓడరేవులోని పెట్రోలియం పారిశ్రామిక జోన్లోని ఇంధన నిల్వ కేంద్రాలే లక్ష్యంగా డ్రోన్లు దూసుకువచ్చాయి.
ఈ దాడి కారణంగా అక్కడ భారీగా మంటలు చెలరేగాయని ఫుజైరా సమాచార కార్యాలయం ధృవీకరించింది. వెంటనే అప్రమత్తమైన సివిల్ డిఫెన్స్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు.
అయితే, ఈ దాడి ప్రభావం అంతర్జాతీయ చమురు సరఫరాపై తీవ్రంగా పడింది. భద్రతా కారణాల దృష్ట్యా ఫుజైరా ఓడరేవులో చమురు లోడింగ్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.
ప్రపంచ చమురు డిమాండ్లో సుమారు ఒక శాతం వాటా కలిగిన ముర్బన్ క్రూడ్ ఆయిల్ ఎగుమతులకు ఫుజైరా ప్రధాన కేంద్రంగా ఉంది. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ మీదుగా కాకుండా నేరుగా చమురు ఎగుమతి చేసే ఏకైక మార్గం కావడంతో, ఈ ఓడరేవుపై దాడి జరగడం ప్రపంచ ఇంధన మార్కెట్లను ఆందోళనలోకి నెట్టింది.
ఈ దాడికి కొన్ని గంటల ముందే దుబాయ్ ఎయిర్పోర్టు సమీపంలో కూడా ఇలాంటి దాడి జరగడం గమనార్హం. ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.
