కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులను, నిరుద్యోగ జెఎసి నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకుంటారనే సాకుతో ఆదివారం రాత్రి నుంచే పోలీసులు నిరుద్యోగులను, తెలంగాణ జాగృతి యువజన విభాగం నాయకులను అక్రమంగా అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆమె మండిపడ్డారు. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ మాట నిలబెట్టుకోలేక ఇప్పుడు నిరసన గళాలను నొక్కేయాలని చూడటం దుర్మార్గమని విమర్శించారు.
ప్రభుత్వం తక్షణమే అరెస్టయిన నిరుద్యోగులందరినీ విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని హితవు పలికారు. తక్షణమే స్పష్టమైన జాబ్ క్యాలెండర్ను ప్రకటించి, రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని కవిత డిమాండ్ చేశారు. నిరుద్యోగుల ఆకాంక్షలను విస్మరించి, కేవలం రాజకీయ పర్యటనల కోసం వారిని వేధించడం సరికాదని ఆమె ఈ ప్రకటనలో స్పష్టం చేశారు
.
