కష్టాల్లో ఉన్న ఇండిగో ఎయిర్లైన్స్ మంగళవారం తమ కార్యకలాపాలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకున్నాయని, ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు నిరంతరం చర్యలు కొనసాగిస్తున్నామని ప్రకటించింది. తాజా వీడియో సందేశంలో ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ పేర్కొన్నట్లుగా, రద్దు లేదా ఆలస్యం అయిన విమానాల్లో ప్రయాణించాల్సిన లక్షలాది మంది ప్రయాణికులకు ఇప్పటికే పూర్తి రీఫండ్లు జమయ్యాయని, ఈ ప్రక్రియ రోజువారీగా కొనసాగుతోందని చెప్పారు.
అయితే చివరి నిమిషంలో రద్దయిన విమానాలు లేదా భారీగా ఆలస్యం అయిన ప్రయాణాలకు సంబంధించి ఇవ్వాల్సిన పరిహారం విషయంలో ఎల్బర్స్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ ప్రయాణికుల చార్టర్ ప్రకారం విమానం బయలుదేరే తేదీకి కనీసం రెండు వారాల ముందు రద్దు సమాచారం ఇవ్వలేకపోతే, ఎయిర్లైన్ తప్పనిసరిగా పరిహారం చెల్లించాలి.
అంతేకాకుండా, ఈ పరిహారం ప్రయాణికులు అడిగే అవసరం లేకుండా స్వయంగా ఇవ్వాలి. “ఇండిగో మళ్లీ నిలదొక్కుకుంది. మా కార్యకలాపాలు స్థిరంగా ఉన్నాయి. జరిగిన భారీ కార్యకలాపాల అంతరాయం సమయంలో మేము మిమ్మల్ని నిరాశపరిచాం, దానికి క్షమాపణలు కోరుతున్నాం” అని ఎల్బర్స్ వీడియోలో చెప్పారు.
శ్రమ పడి ముందుగానే పరిస్థితిని చక్కదిద్దాం
డిసెంబర్ 10 నుంచి 15 మధ్య కార్యకలాపాలు పూర్తిగా సాధారణ స్థితికి వస్తాయని ముందుగా అంచనా వేసినప్పటికీ, ఇప్పటికే డిసెంబర్ 9 నాటికి కార్యకలాపాలు పూర్తిగా స్థిరపడ్డాయని వెల్లడించారు. ఎల్బర్స్ మాట్లాడుతూ ప్రణాళికలో లేకుండా రద్దయిన లేదా ఆలస్యమైన విమానాల వల్ల బాధపడిన ప్రయాణికులను గుర్తుచేసుకుంటూ, “వేలాది మంది ప్రయాణం చేయలేకపోయారు. దీనికి మేము క్షమాపణలు చెబుతున్నాం” అన్నారు.
మొదట చిక్కుకున్న ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరేలా చేయడం తమ ప్రాధాన్యతగా భావించామని, ఆ తర్వాత రీఫండ్ ప్రక్రియను ప్రారంభించామని తెలిపారు. విమానాశ్రయాల్లో చిక్కుకున్న బ్యాగులు చాలా వరకు ప్రయాణికుల ఇళ్లకు చేరాయని, మిగిలినవి కూడా త్వరలో ఇవ్వడానికి బృందాలు శ్రమిస్తున్నాయని చెప్పారు.
ఇండిగో నెట్వర్క్ పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 5న కేవలం 700 విమానాలను మాత్రమే నడపగలిగామని, ఆ తర్వాత సంఖ్య క్రమంగా పెరిగి డిసెంబర్ 6న 1,500కి, డిసెంబర్ 7న 1,650కి, సోమవారం 1,800కి పెరిగిందని చెప్పారు.
మంగళవారం కూడా 1,800కి పైగా విమానాలు నడిచాయని తెలిపారు. సోమవారం నాటికి ఇండిగో తన మొత్తం 138 గమ్యస్థానాలకు తిరిగి సేవలు అందిస్తున్నదని, సమయానికి విమానాలు నడిచే పనితీరు కూడా సాధారణ స్థితికి వచ్చిందని ఎల్బర్స్ వివరించారు.
