అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వ నషా ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా శ్రీకాకుళం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ అవగాహన ర్యాలీ, అనంతరం మానవహారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి డే అండ్ నైట్ జంక్షన్ వరకు సాగిన ర్యాలీని శ్రీకాకుళం పట్టణ డీఎస్పీ సీహెచ్. వివేకానంద జెండా ఊపి ప్రారంభించారు.
పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల రహిత జిల్లాగా శ్రీకాకుళాన్ని తీర్చిదిద్దడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గంజాయి, మత్తు మాత్రలు తదితర మాదక పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండేందుకు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన ఆయన, అక్రమ రవాణా లేదా విక్రయాలపై సమాచారం ఉంటే ఈగల్–1972 టోల్ ఫ్రీ నంబర్కు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
కార్యక్రమంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సీహెచ్. రామచంద్ర కుమార్, సీఐలు ఈశ్వరరావు, రామారావు, పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
